is There any Conspiracy behind deterioration of Naveen Patnaik’s health asks PM Modi: మరోసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దాని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒడిశాలో తాము అధికారంలోకి వస్తే సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ మోదీ హామీ ఇచ్చారు. ఒడిశాలో బారిపదాలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదు దశాబ్దాల తరువాత కేంద్రంలో వరుసగా మూడోసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
‘నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక ఏమైనా కుట్ర ఉందా..? ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న లాబీనే సీఎం ఆరోగ్యం క్షీణించడానికి కారణమా..?. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించుటకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే, ఒడిశా సీఎం కదలికలను కూడా సీఎం సన్నిహుతుడైనటువంటి పాండియన్ నియంత్రిస్తున్నారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని మోదీ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ
ఇటు సీఎం నవీన్ పట్నాయక్ కు అత్యంత సన్నిహితంగా ఉండే బీజేడీ నేత వీకే పాండియన్ ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేడీకి ముగింపు పలకాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తే ఒడిశాకు సీఎం కావాలని కోరుకుంటున్నారని మోదీ అన్నారు. కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన పాండియన్ ది తమిళనాడు. పంజాబ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అవ్వడంతో ఆయన ఒడిశా మహిళను వివాహం చేసుకుని.. ఒడిశాలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆయనపై బయటి వ్యక్తి అంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నది.