Cyclone: దక్షిణాది రాష్ట్రాలకు వాన గండం పొంచి ఉందా? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుందా? రాబోయే రెండు లేదా మూడు రోజులు వర్షాలు దంచి కొడతాయా? అవుననే అంటోంది భారతీయ వాతావరణ శాఖ. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రెండురోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో అల్పపీడనం చురుగ్గా కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారానికి వాయుగుండంగా మారనుంది.
ఈ వాయుగుండం మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి ‘సెన్ యార్’ తుఫానుగా పేరు నామకరణం చేయనున్నారు. సెన్ యార్ అనే పేరును యూఏఈ దేశం సూచించింది. అల్పపీడనం తుఫానుగా మారిన తర్వాత ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా అంచనా వేయలేదని అధికారులు తెలిపారు.
ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తుఫాన్ సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 28 నుండి డిసెంబర్ ఒకటి వరకు ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
నవంబర్ 22 నుంచి 25 వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుకుతున్నాయి. తిరునెల్వేలి, తెన్కాశిలోని తామిరబరణి నది పరీవాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యింది.
ALSO READ: సినిమాని తలపించిన ఘటన.. ఐసీయూలో పెళ్లికూతురు
వర్షాల కారణంగా తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. తామిరబరణి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సూచన చేశారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున, పర్యాటకులు, ఆ ప్రాంతవాసులు, పడవల యజమానులు అప్రమత్తంగా నడపాలని పేర్కొంది. నవంబర్ 22 నుండి 26 వరకు కేరళ, మాహేలో.. నవంబర్ 22 నుంచి 23 వరకు లక్షద్వీప్, నవంబర్ 23న రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.