Delhi Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రతి వింటర్ సీజన్ వచ్చినప్పుడల్లా హస్తిన ప్రజలు గాలిలో కలిసిపోయే పొగమంచు, పేలవ నాణ్యత గల వాయువులు, వాహనాల పొగలు, విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీల్చే గాలిలో ఆక్సిజన్ తగ్గిపోగా పీఎం స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో.. ప్రజలు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, కళ్ల మండుట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో విఫలమైందంటూ.. ఢిల్లీ నివాసులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5 ప్రకారం జారీ చేసినట్లు పర్యావరణ శాఖ పేర్కొన్నాయి. మిగతా సగం మంది ఉద్యోగులు అవసరమైతేనే ఆఫీసులకు హాజరవ్వాలని, గరిష్టంగా ప్రజా రవాణా ద్వారా ప్రయాణించాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
పీక్ అవర్స్లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం, MCD కార్యాలయాల సమయాలను కూడా మార్చింది.
MCD కార్యాలయాలు: ఉదయం 8:30 – సాయంత్రం 5:00
ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు: ఉదయం 10:00 – సాయంత్రం 6:30
ఈ చర్యలతో రోడ్లపై ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాలు చేరకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది.
చిన్నారులను దృష్టిలో ఉంచుకుని, నవంబర్–డిసెంబర్లో జరగాల్సిన అన్ని క్రీడా కార్యక్రమాలను కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందస్తుగా వాయిదా వేసింది. పాఠశాలల్లో కూడా పిల్లలను బయట కార్యకలాపాలకు అనుమతించవద్దని సూచనలు జారీ అయాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) గాలి నాణ్యతను ఈవిధంగా పేర్కొంది.
0–50: మంచి గాలి / స్వచ్ఛమైన వాతావరణం
51–100: తగినంత మంచిది
101–200: మోస్తరు కాలుష్యం, కొందరికి అసౌకర్యం
201–300: హానికరం, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్థమా బాధితులకు ప్రమాదం
301–400: అత్యంత హానికరం
401–500: అత్యంత ప్రమాదకరం
ఈ సీజన్లో ఢిల్లీ AQI తరచూ 400–500 శ్రేణిలో నమోదవుతుండటంతో.. నిపుణులు అత్యంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కర్ణాటకలో కుర్చీలాట.. సీఎం పదవి కోసం సిద్ధూ వర్సెస్ డీకే.. హైకమాండ్ తో మంతనాలు
ప్రస్తుత పరిస్థితి ఢిల్లీలో గాలి కాలుష్యం ఎంత భయంకర దశకు చేరిందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు కొంత ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలికంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠినమైన, స్థిరమైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల నియంత్రణ, వాహనాల నియంత్రణ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణలాంటి చర్యలు తీసుకోకపోతే.. ప్రతి శీతాకాలం ఢిల్లీ ప్రజలకు మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉంది.