BRS Politics: బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కవిత జిల్లాల పర్యటనలు ఆ పార్టీలో గుబులు రేపుతోందా? ఆమె చేస్తున్న ఆరోపణలతో నేతలకు సెగ తగిలిందా? దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఏమంటోంది? ఎదురుదాడి చేయాలని నేతలకు సంకేతాలు వెళ్లాయా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది?
కవిత విషయంలో ప్లాన్ మార్చిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ కవిత జిల్లాల బాట పట్టారు. నాలుగు నెలలపాటు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారి చేసిన అవినీతి చిట్టాను బయటపెడుతున్నారు.ఈ విషయంలో కొందరు నేతలు సైలెంట్గా ఉన్నారు.
రోజురోజుకూ కవిత వ్యవహారం జఠిలం కావడంతో ఆమెపై ఎదురుదాడికి దిగాలని బీఆర్ఎస్ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కేసీఆర్ కూతురు కావడం వల్ల ఇన్నాళ్లు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నామని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం లేదన్నారు. లిక్కర్ రాణి అని పిలిపించుకున్నది ఎవరు? అంటూ కౌంటరిచ్చారు.
కవితపై బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి
నువ్వు ఎత్తకపోతే బోనం లేనట్టు, నువ్వు ఆడకపోతే బతుకమ్మ లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని వ్యాఖ్యానించారు. కేసీఆర్కి మంచి పేరు తెస్తుంటే.. ఆయన్ని మానసికంగా వేధిస్తున్నావని దుయ్యబట్టారు. కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏమీ కాదని, తాము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అటూ తమను లంబాడా మహిళలు నిలదీస్తున్నారని విమర్శించారు.
నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని దుయ్యబట్టారు. ఎవర్ని సంతోషం పెట్టడానికి తనపై కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఒక్క వ్యవసాయ క్షేత్రం ఉందని, మీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్హౌస్ లేదా? అన్ని పైసలు ఎక్కడి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
ALSO READ: హైదరాబాద్లో అగ్నిప్రమాదం.. తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం
తండ్రి వయసున్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని జాగృతిలో చేరాలని ఒత్తిడి చేసిందెరు? ఒప్పుకోనివారిపై తన మాదిరిగా ఆరోపణలు చేస్తున్నదెవరని సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకీ కవిత మాజీ మంత్రి నిరంజన్రెడ్డిపై ఏం ఆరోపణలు చేశారు? సోమవారం వనపర్తి వచ్చారు ఎమ్మెల్సీ కవిత.
గడిచిన పదేళ్లుగా వనపర్తి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి ఏమీ జరగలేదని వ్యాఖ్యానించారు కవిత. ఈ విషయం ఏ చిన్న పిల్లవాడ్ని అడిగినా మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అవినీతి గురించి చెబుతారని వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి రాజకీయ నేతను ఎక్కడా చూడలేదన్నారు. వనపర్తిలో ఆయనుంటే బీఆర్ఎస్కు కష్టమని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలన్నారు.
దేవుడి మాన్యాలను నిరంజన్రెడ్డి మనుషులు కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అలంపూర్లో తహసీల్దార్ ఆఫీసును తగులబెట్టిన విషయం కేసీఆర్కు తెలియదన్నారు. పెద్దాయనకు తెలియకుండా హరీశ్రావు కాపాడుతున్నారని ఆయన్ని అందులోకి లాగేశారు. అలంపూర్ లో నిరంజన్రెడ్డికి చెందిన భూముల్లో ఎసైన్డ్ భూములు ఉన్నాయని కుండబద్దలు కొట్టేశారు. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు కవిత. మొత్తానికి కవితపై ఎదురుదాడికి బీఆర్ఎస్ సిద్దమైనట్టు కనిపిస్తోందని అంటున్నారు.