Delhi Police: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజెపి చేపట్టిన నిరసనలు ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురు ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.
డిజిటల్ ప్రచారం వెనుక భారీగా నిధులు?
సిజెపి చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా నిరసనలకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికలను విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రచారం కోసం ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ రూ. 40 వేల నుంచి రూ. 80 వేల వరకు నగదు అందుకున్నట్లు పోలీసుల వద్ద ప్రాథమిక ఆధారాలు లభించాయి. డబ్బులు తీసుకుని సీజేపీకి మద్దతుగా పోస్టులు పెట్టడమే కాకుండా, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కంటెంట్ను ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ.
ఏజెన్సీలు, మాజీ జర్నలిస్టులపై కన్ను
ఈ వ్యవహారంలో కేవలం ఇన్ఫ్లుయెన్సర్లే కాకుండా, కంటెంట్ ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్ , సోషల్ మీడియా నిర్వహణలో పాలుపంచుకుంటున్న మూడు ప్రధాన కంపెనీల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక పత్రాలు, లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రచారాన్ని వెనుకుండి నడిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మాజీ జర్నలిస్టుల ప్రమేయంపై కూడా దర్యాప్తు సాగుతోంది.
పార్లమెంట్ మార్చ్ హింసతో సంబంధాలు?
అసలు ఈ డిజిటల్ ప్రచారానికి సీజేపీకి భారీ స్థాయిలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాయి. సోషల్ మీడియా పోస్టులు, ఈ డిజిటల్ నిధుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అలాగే ఇటీవల జరిగిన పార్లమెంట్ మార్చ్ హింసాకాండకు ఈ నెట్వర్క్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంలో ఉన్న కీలక వ్యక్తులను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Also Read: కశ్మీర్లో ఘోరం.. పేరు అడిగి మరీ కాల్చిచంపిన ఉగ్రవాదులు.. మండిపడిన కాంగ్రెస్ అగ్రనేతలు!