SIR update: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడో దశ ఓటర్ల సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. సుమారు 40 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తూ 17 రాష్ట్రాలు.. ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ భారీ వడపోత ప్రక్రియను చేపట్టనున్నట్లు ఈసీ అధికారులు సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియడంతో నిలిచిపోయిన ఈ సవరణ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పట్టాలెక్కిస్తున్నారు.
దేశంలో మొత్తం 99 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు వివిధ దశల్లో నిర్వహించిన ప్రక్షాళన ద్వారా 60 కోట్ల మంది ఓటర్ల జాబితా ఫిల్టర్ అయ్యింది. ఉత్తర్ప్రదేశ్.. పశ్చిమ బెంగాల్.. తమిళనాడు.. రాజస్థాన్.. కేరళ వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. అస్సాంలో మాత్రం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిగిలిన 40 కోట్ల మంది ఓటర్ల డేటాను సరిచూసే బాధ్యతను మూడో దశలో భాగంగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల జాబితాలో దొర్లిన తప్పులు.. మరణించిన వారి పేర్లు.. డూప్లికేట్ ఓట్ల తొలగింపు సులభతరం కానుంది.
వాస్తవానికి ఈ సవరణ ప్రక్రియ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై ఫిబ్రవరి 19నే రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అయితే రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ షెడ్యూల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బిహార్లోని ఓటర్ల సవరణపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడం.. పశ్చిమ బెంగాల్కు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు.. ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగియడంతో అధికారులు మూడో దశపై దృష్టి సారించారు.
రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఈ వడపోత కార్యక్రమం ద్వారా ఓటర్ల చిరునామాలు.. ఫోటోల మార్పులు.. కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను పరిశీలిస్తారు. బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ డేటాలో ఉన్న లోపాలను సరిదిద్ది.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ SIR ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయ పార్టీల విమర్శలకు తావు లేకుండా అత్యంత పారదర్శక సాంకేతికతను ఈ ప్రక్రియలో వినియోగించనున్నారు.
Read Also: భారత్లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!