Delhi: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగింది. మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుతాయా? తగ్గవచ్చని సామాన్యులు సైతం ఎన్నో లెక్కలు వేసుకుంటున్నాడు. దీనిపై నోరు విప్పింది కేంద్రం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని తేల్చి చెప్పింది కేంద్రం.
ఇరాన్ యుద్ధం ఆగింది.. పెట్రోల్ ధరల మాటేంటి?
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ రెండు దేశాల నిర్ణయంతో ప్రపంచదేశాలు కాసింత ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్లో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గడం ఖాయమంటూ సామాన్యుడు చర్చించుకుంటున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేష్ గోపి ఓ ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన మాత్రాన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేమన్నారు. ముడిచమురు సరఫరా పరిస్థితుల్ని సమీక్షించాలన్నారు.
ఆయిల్ ధరలపై కేంద్రం క్లారిటీ, ఇప్పట్లో లేనట్టే?
ఆ తర్వాత ఇంధన ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీనికితోడు చమురు కొనుగోలు, రవాణా, నిల్వలు, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుందని తేల్చేశారు. దేశంలో ముడిచమురు లభ్యత, సరఫరా పరిస్థితులను నిరంతరం పెట్రోలియం శాఖ పర్యవేక్షిస్తోందన్నారు.
సరైన సమయంలో ధరల తగ్గింపుపై సమీక్ష చేస్తామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లతో ముడి చమురు ధరలు ముడిపడి ఉన్నాయన్నారు. విదేశీ మారకం విలువ, పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు పరిగణలోకి వస్తాయని చెప్పకనే చెప్పారు. హర్మూజ్ జలసంధి ఓపెన్ అయినప్పటికీ ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు.
ALSO READ: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!
తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైన నుంచి దేశంలో చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. తొలుత ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందు రాలేకపోవడంతో ఆ భారమంతా కేంద్రంపై పడిన విషయం తెల్సిందే.