Malliswari Casting Secrets: విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు కె. విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ రోమ్-కామ్ (రొమాంటిక్ కామెడీ) చిత్రం ‘మల్లీశ్వరి’ విడుదలై రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాతోనే బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు విజయభాస్కర్ ఈ సినిమా కాస్టింగ్ వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను, కత్రినా కైఫ్ను డైరెక్ట్ చేయడంలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.
Read also-పెద్ది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్.. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!
దర్శకుడు విజయభాస్కర్ మాట్లాడుతూ, మల్లీశ్వరి పాత్ర కోసం మొదట అందరి ఛాయిస్ సొనాలి బింద్రే అని వెల్లడించారు. “నాకు సొనాలి బింద్రే అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో ప్రొఫెషనల్, మంచి నటి. అంతకుముందు నేను ఆమెతో ‘మన్మథుడు’ సినిమా చేశాను. ఆ కాలంలో ఆమె ఎంతో అందమైన, క్రమశిక్షణ గల నటి కావడంతో మల్లీశ్వరి పాత్రకు ఆమెనే సరైనదని అందరూ అనుకున్నారు. కానీ, నాకు మాత్రం ఆమె ఈ పాత్రకు సెట్ కాదనిపించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సరికొత్త ముఖాన్ని పరిచయం చేయాలని నేను భావించాను. అప్పుడే ప్రేక్షకులకు ఆమె నిజంగానే ఒక యువరాణి అనే ఫీలింగ్ కలుగుతుందని నమ్మాను” అని విజయభాస్కర్ చెప్పారు.
ఒక ప్రకటనలో కత్రినా కైఫ్ను చూసి, ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని విజయభాస్కర్ బలంగా నమ్మారు. ఆమెను పిలిపించి కథ చెప్పగా, కత్రినా కూడా వెంటనే ఓకే చెప్పింది. అయితే, ఆమెను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది. ముంబైలో అంతా సెట్ అయిన తర్వాత కొన్ని విభేదాలు రావడంతో, ప్రొడక్షన్ టీమ్ అడ్వాన్స్ ఇవ్వజూపినా కత్రినా దాన్ని తీసుకోవడానికి నిరాకరించిందట. ఆ సమయంలో సురేష్ బాబు ఎంతోమంది బ్యూటీ పీజెంట్ (అందాల పోటీల) విజేతలను ఆడిషన్స్, ఫోటోషూట్స్ కోసం పిలిపించినట్లు దర్శకుడు గుర్తుచేసుకున్నారు. కానీ చివరికి దర్శకుడి నమ్మకం మీదే కత్రినా కైఫ్ను ఖరారు చేశారు.
Read also-‘ఆ ఒక్క ఫోన్ కాల్ను తప్పుగా అర్థం చేసుకున్నారు’.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
షూటింగ్ అనుభవాల గురించి విజయభాస్కర్ మాట్లాడుతూ, కత్రినా చాలా కష్టపడే స్వభావం ఉన్న అమ్మాయి అని ప్రశంసించారు. అయితే ఆమెను తెలుగు నేటివిటీకి తగినట్లు మార్చడం చాలా కష్టమైందని ఒప్పుకున్నారు. “ఆమెకు మన బాడీ లాంగ్వేజ్ అస్సలు తెలియదు. కనీసం కూర్చునేటప్పుడు కూడా సరిగ్గా కూర్చోమని చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే వాళ్లు పెరిగిన వాతావరణం పూర్తిగా వేరు. ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉండాలి, ప్రవర్తించాలి అనేదానిపై ఆమెకు ఎలాంటి అవగాహన లేదు. ఆమె కేవలం ఒక యువరాణిలా, రాజసం ఉట్టిపడేలా కనిపించడమే కాకుండా.. ఎంతో గౌరవప్రదంగా, ప్రేమపూర్వకంగా ఉండాలి. దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది” అని ఆయన వివరించారు. ఏదేమైనా, దర్శకుడి నమ్మకం నిజమై ‘మల్లీశ్వరి’గా కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్లోనే అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.