Love Marriage: ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. లేకుంటే మ్యారేజ్ తర్వాత కోరుకున్నవాడితో వెళ్లిపోతున్నారు. మరికొందరైతే భర్తలను చంపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనించిన గుజరాత్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దాని ప్రకారం ప్రేమ వివాహం చేసుకునేవారు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే.
గుజరాత్ లో కొత్త మ్యారేజ్ చట్టం.. ఇకపై పేరెంట్స్కి సమాచారం
గుజరాత్లో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కొత్త రూల్స్ రాబోతున్నాయి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని భావిస్తే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలనే నిబంధన పెట్టింది. ఈ మేరకు వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఆ చట్టం అమల్లోకి వస్తే పేరెంట్స్కు తెలియకుండా పెళ్లి చేసుకోవడం దాదాపు సాధ్యం.
కొత్త సవరణల ప్రకారం పెళ్లి చేసుకునేవారు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలి. ఆ విషయాన్ని దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తు చేసుకున్న వారం లేకుంటే 10 రోజుల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వధూవరుల పేరెంట్స్కు సమాచారం ఇస్తారు. దరఖాస్తుతోపాటు తల్లిదండ్రుల ఆధార్ వివరాలు వాటికి జత చేయాలి.
కొత్త చట్టంలో అనేక చిక్కులు, చట్టం రూపు దాల్చుతుందా?
ఆ సమయంలో వివాహం చేసుకున్న ఫోటోలు, సాక్షుల వివరాలతో సహా అన్నివివరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్కు అప్లోడ్ చేయబడుతుంది.వివాహం డిజిటల్గా రికార్డ్ చేయబడతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన నెల రోజుల తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆయా నిబంధనల వెనుక అసలు ఉద్దేశాన్ని ఆ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు.
దీనివల్ల ప్రేమ పేరుతో జరిగే మోసాలను అరికట్టవచ్చన్నారు. యువతులు లవ్ జిహాద్ బారిన పడకుండా చూడటం మరొక కారణం. మోసపూరిత వివాహాల వల్ల సామాజిక వ్యవస్థను నాశనం అవుతుందని ఆయన తెలిపారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ భవిష్యత్తులో వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటి గురించి వాట్సాప్ ద్వారా వారి తల్లిదండ్రులకు తెలియ జేయబడే పోర్టల్ వస్తుందన్నారు.
ALSO READ: జార్ఖండ్ లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్
తల్లిదండ్రుల మనోభావాలను, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతుందన్నారు. గుజరాత్ ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తు చేస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రమేయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొంతమంది చట్టసభ సభ్యులు, కొన్ని జంటలకు ఇలాంటివి అసౌకర్యంగా ఉన్నాయని వాదన లేకపోలేదు. ఈ నిబంధనలు కేవలం ప్రతిపాదన దశలో ఉన్నాయని, దీనిపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే కోర్టులో సవాలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.