Telangana e-bus Order: తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1,085 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (EVEY)కు మొత్తం రూ. 1,800 కోట్ల విలువైన ఆర్డర్ చేసింది. 1,085 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా, నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుంచి రెండు లెటర్స్ ఆఫ్ అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ షేర్లు 4% పైగా లాభపడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డర్లో 1,025.. 12-మీటర్ల నాన్-ఎసి బస్సులు, ఇంట్రా సిటీ కార్యకలాపాల కోసం 60.. 12 మీటర్ల ఎసి బస్సులు ఉన్నాయి. ఈ ఒప్పందం 12 సంవత్సరాల కాలానికి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ లేదంటే OPEX మోడల్ ప్రకారం కొనసాగుతుంది. ఈ బస్సులను 20 నెలల్లో డెలివరీ చేయాలి. ఈ ఒప్పందం ప్రకారం, EVEY ఒలెక్ట్రా నుంచి బస్సులను కొనుగోలు చేస్తుంది. 1,085 బస్సుల సరఫరా విలువ సుమారు రూ. 1,800 కోట్లు. 12 సంవత్సరాల కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణను కూడా కంపెనీ చూసుకుంటుంది. ఒలెక్ట్రా, EVEY మధ్య లావాదేవీ సంబంధిత పార్టీ లావాదేవీల పరిధిలోకి వస్తుందని, ఆర్మ్స్ లెంగ్త్ ప్రాతిపదికన నిర్వహించబడుతుందని ఫైలింగ్ వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఆర్డర్ అందుకున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో ఒలెక్ట్రా షేర్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ఈ ప్రకటన తర్వాత, స్టాక్ ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.1,061.50కి చేరింది. NSEలో షేర్లు రూ. 41.90 పెరిగాయి. ఏకంగా 4.13% షేర్ వ్యాల్యూ పెరిగింది. ఒక్కో షేర్ విలువ రూ. 1,056.40గా ట్రేడ్ అయ్యింది.
Read Also: కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV.. రెండు కార్ల మధ్య తేడాలు ఇవే!
ఇక తాజాగా ఫిబ్రవరి ప్రారంభంలో ఒలెక్ట్రా Q3 ఫలితాలను వెల్లడించింది. ఈ సమయంలో స్థిరమైన పనితీరును కనబరించింది. Q3 నికర లాభం సంవత్సరానికి 0.3% పెరిగింది. రూ. 46.4 కోట్లకు చేరుకుంది. అయితే కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం 28.8% పెరిగి రూ. 663.6 కోట్లకు చేరుకుంది. EBITDA 17.7% పెరిగి రూ. 93 కోట్లకు చేరుకుంది.
Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ స్మూత్ గా నడవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే!