Rah Veer Scheme: భారత్ లో ప్రతి ఏటా 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లే వారి కోసం కేంద్రం రహ్-వీర్ పథకాన్ని ప్రారంభించింది. బాధితులను రక్షించి ఆసుపత్రిలో చేర్పించిన వారికి రూ.25 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది. అలాగే బాధితులకు 7 రోజుల చికిత్స కోసం రూ.1.50 లక్షలు ఆసుపత్రికి చెల్లిస్తామని తెలిపింది. రోడ్డు ప్రమాదాలపై లోక్ సభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్ సభలో మాట్లాడుతూ.. చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తనతో ముడిపడి ఉన్నాయని, ప్రజలు తరచూ భద్రతా నిబంధనలను విస్మరిస్తారన్నారు. లోక్సభ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంపీల సూచనలను పొందడానికి రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
రోడ్డు భద్రతపై బీజేపీ ఎంపీ ముఖేష్కుమార్ చంద్రకాంత్ దలాల్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ.. రోడ్డు ప్రమాద మరణాలలో 66 శాతం 18-34 సంవత్సరాల వయస్సు గలవారే ఉన్నారన్నారు. రోడ్డు భద్రతా నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారాలను నిర్వహిస్తున్నప్పటీ పెద్దగా మార్పు కనిపించడం లేదని అన్నారు. చర్చలో భాగంగా స్పీకర్ ఓం బిర్లా సభ్యులను వారి నియోజకవర్గాల్లో రోడ్డు భద్రత కోసం ప్రచారం చేపట్టాలని కోరారు.
రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తికి రూ. 25,000 ఇచ్చి ‘రహ్-వీర్’ అని పిలుస్తామని, అందుకు కేంద్రప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిందని నితిన్ గడ్కరీ చెప్పారు. అలాగే, రోడ్డు ప్రమాద బాధితుల 7 రోజుల చికిత్స కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తుందన్నారు.