Train accident: హైదరాబాద్ నుంచి బెల్గాం వెళ్తున్న ప్రత్యేక రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా ఒక బోగి కింద నుంచి మంటలు, దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి బెల్గాం వెళ్తున్న ఈ స్పెషల్ రైలు శంకర్ పల్లి స్టేషన్ దాటుతున్న సమయంలో.. ఇంజిన్ వెనుక ఉన్న మొదటి ప్యాసింజర్ బోగి చక్రాల వద్ద నిప్పురవ్వలు చెలరేగాయి. బ్రేక్ లైనర్లు చక్రాలకు గట్టిగా పట్టేయడం వల్ల ఏర్పడిన రాపిడికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. టైర్లు, బ్రేక్ షూల వద్ద నుండి పొగలు రావడాన్ని గమనించిన గార్డు, స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై లోకో పైలట్కు సమాచారం అందించారు.
మంటలను గమనించిన వెంటనే రైల్వే సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో రంగంలోకి దిగారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకముందే వాటిని అదుపులోకి తెచ్చారు. బోగి కింద నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వెంటనే రైలు దిగి పరుగులు తీశారు. అయితే, సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయాణికులను శాంతింపజేశారు.
ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక నిపుణులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బోగి చక్రాలను, బ్రేక్ సిస్టమ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. బ్రేక్ జామ్ సమస్యను పరిష్కరించిన అనంతరం, రైలు ప్రయాణానికి సురక్షితమేనని నిపుణులు ధ్రువీకరించారు. వారి సూచనల మేరకు రైలు తిరిగి బెల్గాంకు బయలుదేరింది. సుమారు గంటన్నర పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.