INS Kadamba: దేశ రక్షణలో అత్యంత కీలకమైన, భారత నావికాదళానికి చెందిన వ్యూహాత్మక స్థావరం సమీపంలో ఒక పక్షి కలకలం రేపింది. కర్ణాటకలోని కార్వార్ తీరంలో ఉన్న ప్రతిష్టాత్మక ‘ఐఎన్ఎస్ కదంబా’ (INS Kadamba) నావికా స్థావరం దగ్గర చైనాకు చెందిన జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker) అమర్చిన ఒక సీగల్ పక్షి (Seagull) పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమైంది. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సంచరించే అత్యంత నిశితమైన ప్రదేశంలో ఈ పక్షి సంచరించడం, అది కూడా చైనా పరికరంతో దొరకడంతో ఇది గూఢచారి పక్షా? (Spy Bird) లేక పరిశోధనలో భాగమా? అనే అనుమానాలు అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. కార్వార్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో ఒక సీగల్ పక్షి గాయపడి ఎగరలేక కింద పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు, పక్షి వీపుపై ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అమర్చి ఉండటాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే కోస్టల్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆ పక్షిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు ఆ పరికరాన్ని నిశితంగా పరిశీలించగా అది చైనాకు చెందిన జీపీఎస్ ట్రాకర్ అని తేలింది. ఆ చిన్న పరికరానికి సోలార్ ప్యానెల్ కూడా అమర్చి ఉంది. అంతేకాకుండా, ఆ ట్రాకర్పై ఒక ఈమెయిల్ ఐడితో పాటు, ఈ పక్షి కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ఒక సందేశం ఉంది. ఆ ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేయగా, అది ‘చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్’కు (Chinese Academy of Sciences) చెందిన ‘రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో-ఎన్విరాన్మెంటల్ సైన్సెస్’ సంస్థదని వెల్లడైంది.
దీంతో ఇప్పుడు అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. సాధారణంగా వలస పక్షుల కదలికలను, వాటి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఇలాంటి ట్రాకర్లను అమర్చడం సర్వసాధారణం. అయితే, ఈ పక్షి దొరికిన లొకేషన్ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కార్వార్లోని నేవీ బేస్ భారతదేశ తూర్పు తీర రక్షణలో అత్యంత కీలకమైనది. ఇటీవలే దీనిని విస్తరించారు కూడా. ఇలాంటి చోట చైనా ట్రాకర్ ఉన్న పక్షి సంచరించడం నిఘాలో భాగమా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలో గూఢచర్యం కోసం జంతువులను, పక్షులను వాడిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత ఏడాది 2024 నవంబర్లో కూడా సరిగ్గా ఇదే ప్రాంతంలో ఒక గద్దకు జీపీఎస్ ట్రాకర్ ఉండటం కలకలం రేపింది. అప్పట్లో విచారణ అనంతరం అది వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని తేల్చారు. ఇప్పుడు దొరికిన సీగల్ పక్షి విషయంలోనూ ప్రాథమికంగా పరిశోధన కోసమేనని భావిస్తున్నప్పటికీ, చైనా వ్యవహారం కాబట్టి అధికారులు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. నిజంగా ఇది పర్యావరణ అధ్యయనమా? లేక పక్షుల సాటున చైనా మన రక్షణ వ్యవస్థల ఫోటోలు, లొకేషన్ డేటాను సేకరిస్తోందా? అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
Read Also: UPI Offline: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్.. జస్ట్ ఇలా *99# డయల్ చేస్తే చాలు