హిమాచల్ ప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే ఆరు నెలల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2026 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించడమే ఈ కఠిన నిర్ణయాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి తన జీతంలో 50 శాతం కోతను స్వచ్ఛందంగా ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. మంత్రుల జీతాల్లో 30 శాతం, ఎమ్మెల్యేల వేతనాల్లో 20 శాతం తగ్గింపు వర్తిస్తుంది. కేవలం రాజకీయ నేతలే కాకుండా పాలనా యంత్రాంగంపై కూడా ఈ ప్రభావం పడనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వంటి ఉన్నతాధికారుల జీతాల్లో 30 శాతం, మధ్యస్థాయి అధికారుల వేతనాల్లో 20 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఆర్థిక ఆంక్షలు విధించడం ఇదే మొదటిసారి.
రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పు
రాష్ట్రంపై ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారం ఉంది. 2026–27 బడ్జెట్లో సుమారు 3,586 కోట్ల రూపాయల కోత విధించారు. రాష్ట్ర ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల దాదాపు 6,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 92 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడాల్సిన దయనీయ స్థితి నెలకొంది.
సెంట్రల్ గ్రాంట్లు నిలిచిపోవడంతో…
కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన గ్రాంట్లు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ఇంధన సెస్సులను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ లోటు పూడకపోవడంతో వేతనాల వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై అధికారుల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ చట్టపరమైన పోరాటానికి కొందరు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వం, బ్యూరోక్రాట్ల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసేలా కనిపిస్తోంది.
సంక్షోభానికి మూలకారణం ఏంటంటే..?
సంక్షేమ పథకాల పేరుతో పరిమితికి మించి చేసిన అప్పులే ఈ సంక్షోభానికి మూలకారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ మోయలేని భారం తలకెత్తుకోవడం వల్ల ఈ ముప్పు తప్పలేదు. భవిష్యత్తులో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే నిలిపివేసిన జీతాలను వెనక్కి ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం అధిక అప్పులతో నడుస్తున్న ఇతర రాష్ట్రాలకు ఒక గట్టి హెచ్చరికగా మారింది.