Kaleshwaram Verdict: కాళేశ్వరం అవినీతిపై నిజానిజాలు తేల్చేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ అంశం తెలంగాణలో రాజకీయ చర్చను లేవనెత్తింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. కాళేశ్వరంపై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ ఈ తీర్పును అభివర్ణిస్తుంటే.. కాళేశ్వరం అవినీతిని వెలికి తీయడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. అసలు పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న వాస్తవ అంశాలేంటి? తీర్పు కాపీ ఏం చెబుతోంది? ఇప్పుడు పరిశీలిద్దాం.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరశ్ కుమార్ సింగ్, జస్టిస్ మెుహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయని.. కమిషన్ తన పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని అభిప్రాయపడింది. విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని.. అభియోగాలు మోపే ముందు వారి వాదనలు వినలేదని పేర్కొంది. కాబట్టి ఈ కమిషన్ నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో మాత్రం చట్టబద్దంగానే ఉందని డివిజన్ బెంచ్ సమర్థించడం గమనార్హం.
రాష్ట్ర పరిధిలో జరిగిన ఏ అవినీతి పైన అయినా కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్లు పిటిషనర్లు నిరూపించలేకపోయారన్న వ్యాఖ్యలను సైతం డివిజన్ బెంచ్ చేసింది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షంగా ఏమీలేదని.. నిజానిజాలను తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పినదేనని వ్యాఖ్యానించింది. అయితే కమిషన్ నిందారోపణలు చేసే ముందు వాటికి సంబంధించిన సాలిడ్ ఆధారాలను అందించాల్సిందని హైకోర్టు పేర్కొంది. సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని.. అలా చేయక పోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
కమిషన్ ఎంక్కైరీ యాక్ట్ లోని సెక్షన్ 8 కింద ఉన్న చట్టబద్ద రక్షణను కమిషన్ ఉల్లంగించినట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. తమపై ప్రతీకూల ఆరోపణలు చేసిన సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం పిటిషనర్లకు ఇవ్వకపోవడం.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నివేదికలో తమకు వ్యతిరేకంగా వాడిన పత్రాలను, ఆధారాలను పిటిషనర్లకు చూపించకుండా, ఆరోపణలు ఏంటో వారికి తెలియజేయకుండా ఇచ్చే రిపోర్ట్ పరిపూర్ణమైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్దమే అయినప్పటికీ విచారణ జరిపిన తీరు మాత్రం ఆమోదయోగ్యంగా లేదని హైకోర్టు చెప్పుకొచ్చింది.
మెుత్తంగా హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీని పరిశీలిస్తే.. కేసీఆర్, హరీశ్ రావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హైకోర్టు ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయం స్పష్టతమవుతోంది. విచారణ సందర్భంగా కమిషన్ అవలంభించిన వైఖరిని మాత్రమే హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుబట్టినట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా కమిషన్ విచారణలో తేలిన అంశాలను కూడా హైకోర్టు తప్పుబట్టినట్లు తీర్పు కాపీలో లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే చట్టబద్ద హక్కు ఉందంటూ కూడా రేవంత్ సర్కార్ ను హైకోర్టు పరోక్షంగా సమర్థించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన కన్ క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మెుత్తం మీద హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు.. విపక్ష పార్టీలు ఏ స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకున్నాయో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read: నరరూప రాక్షసుడు.. రెండ్రోజుల్లో 2 అత్యాచారాలు, ఒక హత్య.. బాధితుల్లో IRS అధికారి కుమార్తె!