DK Sivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. పార్టీలో నాయకత్వ మార్పు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్న సమయంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమైన నేపథ్యంలో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
డీకే శివకుమార్ తాను కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అని చెప్పుకొచ్చారు. కొద్దిరోజులుగా తాను పార్టీని వీడుతున్నానని లేదా రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాననే వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను కేవలం పార్టీ ఆదేశాలను, క్రమశిక్షణను పాటిస్తానని, ఈ పార్టీని నిర్మించడంలో.. అభివృద్ధి చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేశానని ఆయన తెలిపారు. ‘నేను కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కాదు. నేను ఈ పార్టీని నిర్మించాను. దీని కోసం అవిశ్రాంతంగా పనిచేశాను’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాజీనామా చేయడం ద్వారా నాయకత్వాన్ని బెదిరించడం తన నైజం కాదని.. అలాంటి రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో.. ముఖ్యంగా రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత, రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కొన్ని వర్గాలు సీఎం మార్పును కోరుకుంటున్నాయని.. డీకే శివకుమార్ ఈ అంశంలో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారని ఊహించాయి. అయితే, డీకేఎస్ తాజా వ్యాఖ్యలు ఆ ఊహాగానాలన్నిటికీ పులిస్టాప్ పెట్టారు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా అధిష్టానంపై పూర్తి విధేయతను.. పార్టీ పట్ల తన నిబద్ధతను తెలియజేశారు.
మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ గురించి వస్తున్న వార్తలపై కూడా డీకేఎస్ స్పందించారు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానన.. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను పార్టీ అధ్యక్షుడిగా కర్ణాటకలో పనిచేసి, తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించానని గుర్తు చేశారు.
మొత్తం మీదజజ డీకే శివకుమార్ ప్రకటన కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో కొంతకాలంగా నెలకొన్న అస్థిరత, అనిశ్చితిపై స్పష్టతనిచ్చినట్లైంది. తాను నిబద్ధత కలిగిన సైనికుడిని అనే ఆయన వ్యాఖ్యలు, ప్రస్తుతానికి సిద్ధరామయ్య ప్రభుత్వానికి.. పార్టీ అధిష్టానానికి తన పూర్తి మద్దతు ఉంటుందని సంకేతాలిచ్చాయి. బ్లాక్మెయిల్ రాజకీయాల ఆరోపణలను తోసిపుచ్చడం ద్వారా.. ఆయన తన రాజకీయ స్థానాన్ని మరింత పదిలపరుచుకునే ప్రయత్నం చేశారు. పార్టీ నిర్ణయాలకు లోబడి ఉంటానని చెప్పడం.. కర్ణాటకలో అధికార పీఠం చుట్టూ ఉన్న ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Hyderabad News: హైదరాబాద్లో దారుణం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, పోలీసులకు గాయాలు