Hyderabad News: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతంలో ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ బర్త్ డే వేడుక సందర్భంగా కలుసుకున్న రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఈ వివాదం.. స్థానిక ట్రాన్స్జెండర్ గ్రూప్ లీడర్ అయిన మోనాలిసా వద్దకు చేరడంతో మరింత రచ్చగా మారింది.
ఘర్షణ పడిన గ్రూపుల్లో ఒక వర్గం సభ్యులు.. ట్రాన్స్ జెండర్ మోనాలిసా తమపై దాడి చేసి.. బూతు మాటలు మాట్లాడిందని ఆరోపించారు. మోనాలిసా ఒక గ్రూప్కు అనుకూలంగా వ్యవహరిస్తూ.. తమపై వివక్ష చూపిందని వారు తెలిపారు. తమకు అన్యాయం జరిగిందని భావించిన ట్రాన్స్జెండర్స్ గ్రూప్ దీనికి నిరసనగా బోరబండ బస్ స్టాప్ వద్ద ధర్నాకు దిగింది. నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇందులో ఓ ట్రాన్స్జెండర్స్ గ్రూప్ తీవ్రంగా ప్రవర్తించింది. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటి.. కొందరు ట్రాన్స్జెండర్స్ తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. దీనితో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున హంగామా జరిగింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించే ప్రయత్నంలో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.
ఘర్షణ, దాడికి సంబంధించి తమ గ్రూప్ మోనాలిసాపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. స్థానిక పోలీసులు మోనాలిసాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో బోరబండ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గ్రూపుల మధ్య ఘర్షణకు అసలు కారణాలు ఏంటి..? లీడర్ మోనాలిసా పాత్ర ఎంత ఉంది..? అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలయాల్సి ఉంది
ALSO READ: Varanasi: ప్రపంచమంతా అంతమైనా.. ‘వారణాసి’ మాత్రం చెక్కు చెదరదు, శివయ్యే స్వయంగా…