టెలికాం కంపెనీలు ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా త్వరలోనే పెంపును అమలు చేయబోతున్నాయి. సుమారు 10 శాతం వరకు రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల మీద పడనుంది. 2024 తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను పెంచుతున్నాయి కంపెనీలు. సగటు కస్టమర్ ఆదాయాన్ని పెంచుకోవాలనే నిర్ణయంలో భాగంగా రేట్స్ హైక్ చేస్తున్నాయి. ఆయా కంపెనీలు 5G విస్తరణలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయ. దీనికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ధరల పెంపుతో ఆ ఖర్చులను కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.
టెలికాం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను, జియో, ఎయిర్ టెల్ చౌక ప్లాన్లను ఎత్తివేయబోతున్నాయి. అంటే తమ ఎంట్రీ లెవల్ ప్లాన్లు అయిన రూ.249కి 1GBని ఇప్పటికే నిలిపివేశాయి. బేస్ ప్లాన్ ఇప్పుడు రూ.299కి 1.5GBగా ఉంది. ఇప్పటితో పోల్చితే, ఏకంగా 17 శాతం పెరిగింది. Vi తన బేస్ ప్లాన్ ను రూ.299కి 1GBగా నిర్ణయించింది.
అటు నెలవారీ ప్లాన్లకు బదులుగా, కంపెనీలు మూడు నెలల ప్లాన్లను ప్రోత్సహించబోతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒకేసారి ఎక్కువ ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాయి. గత త్రైమాసికంలో, జియో సగటు కస్టమర్ ఆదాయం రూ.211.4గా చూపించింది. ఈ కారణంగా ఖర్చు, ఆదాయాలపై సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.
టెలికాం కంపెనీల సమాచారం ప్రకారం.. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు.. ముఖ్యంగా జియో, VI ఇప్పటికే తమ బేస్ ప్లాన్లలో మార్పులు చేసింది. డిసెంబర్ 2025, జూన్ 2026 మధ్య పూర్తి స్థాయిలో రీఛార్జ్ ధరల పెరుగుదల అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరల పెంపు సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఉండవచ్చని టెలికాం నిపుణలు భావిస్తున్నారు.
టెలికాం కంపెనీలు దేశ వ్యాప్తంగా తమ 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్నాయి. ఈ విస్తరణ భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. మూల ధనం చాలా అవసరం ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ దిద్దుబాట్లకు దిగుతున్నాయి. ఈ నిర్ణయంతో నెలవారీ మొబైల్ రీఛార్జ్ బిల్లు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డేటా కోసం కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. చౌకైన ప్లాన్లు ఇప్పటికే కనుమరుగవుతున్నాయి. టెలికాం ఖర్చుల కోసం వినియోగదారుల నెలవారీ రీఛార్జ్ డబ్బులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇకపై వినియోగదారులు ప్రస్తుత డేటా వినియోగాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరాలు, బడ్జెట్కు సరిపోయే ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. త్వరలోనే టెలికాం కంపెనీల నుంచి ధరల పెంపు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పెంపు ప్రకటన రాకముందే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ లు చేసుకుంటే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
Read Also: రూ.100, రూ.110కు పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? మోసపోకూడదంటే ఏ రూల్ పాటించాలి?