Asaram Bapu : ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆశారాం బాపూ మరో రేప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
10 ఏళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో గాంధీనగర్ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ విచారణ చేపట్టిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు.. ఆశారాంను దోషిగా తేల్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. మంగళవారం ఆశారాంకు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఏం జరిగిందంటే..?
2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఒక్కడికే శిక్ష పడింది.
గతంలో జోధ్పూర్లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలారు ఆశారాంబాపూ.
ఈ కేసులోనూ జీవితఖైదు పడింది. 2018 నుంచి జోధ్పూర్ జైలులో ఆశారాం బాపూ శిక్ష అనుభవిస్తున్నారు.