PM Modi: భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మహిళా నేతృత్వ సంస్థల పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ లో మహిళల నేతృత్వంలోని అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. 123 వ ఎపిసోడ్ సంద్భంగా మోదీ తెలంగాణలోని భద్రాచలానికి చెందిన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మాట్లాడారు. స్థానిక మహిళలు గతంలో రోజు వారీ కూలీలుగా, పొలాల్లో శ్రమించే వారని.. కానీ ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నుంచి లండన్ మార్కెట్లకు వారు తయారు చేసే ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా మహిళలు చిరు ధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని వాటిని భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ అని పిలుస్తారని అన్నారు. శానిటరీ ప్యాడ్స్ కూడా తయారు చేస్తున్నారని.. వాటిని స్థానిక పాఠశాలతో పాటు ఆఫీసుల్లో తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా ఎందరో మహిళల సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు.
అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాల వరకు, మహిళలు, అంకితభావం, వ్యాపార దక్షతతో అద్భుతాలు సృష్టిస్తున్నారని మన్ కీ బాత్లోమోదీ కొనియాడారు. ఈ సందర్భంగా.. కొన్ని ప్రత్యేకమైన విజయ గాథలను కూడా ఆయన ఉదహరించారు.
కలబురగి జొన్న రొట్టెలు:
కర్ణాటకలోని కలబురగికి చెందిన జొన్న రొట్టెలు ప్రధాని ప్రస్తావించిన వాటిలో ఒకటి. ఈ ప్రాంతంలోని మహిళలు, స్థానికంగా లభించే జొన్నతో సాంప్రదాయ రొట్టెలను తయారుచేసి, వాటిని విక్రయించడం ద్వారా తమ కాళ్ళపై తాము నిలబడుతున్నారు. ఇది కేవలం వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించడమే కాకుండా.. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆరోగ్యకరమైన, సంప్రదాయ వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో వీరి కృషి ప్రశంసనీయం. ఈ రొట్టెలు కేవలం ఆహారం మాత్రమే కాదు, మహిళల శ్రమకు, సహకారానికి ప్రతీక.
బాలాఘాట్ దీదీ క్యాంటీన్:
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో “దీదీ క్యాంటీన్” గురించి కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళా స్వయం సహాయక బృందాల (SHGs) ద్వారా నడుపబడుతున్న ఈ క్యాంటీన్లు, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ క్యాంటీన్లు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా.. మహిళలకు ఆర్థిక భద్రతను, సామాజిక గుర్తింపును కల్పిస్తున్నాయి. తమ గ్రామాల్లో.. పట్టణాల్లో సామాజిక సేవకు మద్దతు ఇస్తూనే, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలరని ఈ దీదీ క్యాంటీన్లు నిరూపిస్తున్నాయి.
Also Read: పూరి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట.. పలువురు మృతి
ప్రధాని మోడీ వ్యాఖ్యలు భారతదేశ అభివృద్ధిలో నారీశక్తి (మహిళా శక్తి) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ మహిళా నేతృత్వంలోని సంస్థలు కేవలం తమ కుటుంబాలకు మాత్రమే కాకుండా.. మొత్తం సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం వంటి అనేక రంగాలలో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఈ విజయ గాథలు భారతదేశంలోని ప్రతి మూలలోని మహిళలకు స్ఫూర్తినిచ్చి, వారిని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తాయి.