India FDI norms relaxation: భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. భారత్తో భూ సరిహద్దులు పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో గతంలో ఉన్న కఠిన నిబంధనలను సడలిస్తూ మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2020లో ప్రవేశపెట్టిన నిబంధనలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చైనా బంగ్లాదేశ్ పాకిస్థాన్ భూటాన్ నేపాల్ మయన్మార్ అఫ్గానిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు గతంలో ఉన్న తప్పనిసరి ప్రభుత్వ అనుమతి ప్రక్రియలో కొంత వెసులుబాటు లభించనుంది.
2020 జూన్ నెలలో గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత సరిహద్దు దేశాల పెట్టుబడులపై కేంద్రం ఆంక్షలు విధించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని పొరుగు దేశాల కంపెనీలు భారత్లో ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనల వల్ల గత ఐదేళ్లుగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2000 నుండి డిసెంబర్ 2025 వరకు వచ్చిన మొత్తం ఎఫ్డీఐలలో చైనా వాటా కేవలం 0.32 శాతంగానే ఉండటం గమనార్హం. కేవలం 2.51 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చైనా 23వ స్థానంలో నిలిచింది.
పెట్టుబడుల విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం చైనా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత్ ఎగుమతులు 14.25 బిలియన్ డాలర్లకు తగ్గగా.. దిగుమతులు మాత్రం 113.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీనివల్ల వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY26) ఏప్రిల్ నుండి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 38.37 శాతం పెరగడం సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.
గతంలో గాల్వన్ ఘర్షణల అనంతరం భారత్ టిక్ టాక్ వీచాట్ అలీబాబా వంటి 200కు పైగా చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దేశీయ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు పెట్టుబడి నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ ఆటోమొబైల్ వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే భద్రతాపరమైన అంశాల్లో రాజీ పడకుండా ఈ కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది.