India on Iran Israel: పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మరియు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరతపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. ముఖ్యంగా పౌరులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది.
పశ్చిమాసియాలో సుమారు కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో, అక్కడి భద్రతా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. యుద్ధ మేఘాల కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడటం, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల విదేశీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంపై విదేశాంగ శాఖ స్పందించింది. సంబంధిత దేశాలు సంయమనం పాటించాలని, తక్షణమే హింసను వీడి చర్చల దిశగా అడుగులు వేయాలని భారత్ కోరింది.
గల్ఫ్ దేశాల్లో స్థిరత్వం దెబ్బతింటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతంలోని తమ పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అవసరమైన చోట ఎంబసీల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపింది. రణరంగంగా మారిన పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాలని భారత్ పిలుపునిచ్చింది.
మరోవైపు పశ్చిమ ఆసియాలో ఇరాన్.. ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు గగనతల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) పై కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శంషాబాద్ నుండి పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన సుమారు 10 విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. గల్ఫ్ ప్రాంతానికి ప్రయాణించే వారు.. అక్కడ నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ఢిల్లీ.. ముంబై.. బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల నుండి ఇరాన్.. ఇజ్రాయెల్ వైపు వెళ్లాల్సిన అన్ని విమాన సర్వీసులు రద్దు కావడం గమనార్హం.
Read Also: US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!