New Labor Codes 2025: నవంబర్ 21, 2025 భారతీయ కార్మిక రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోనుంది. శుక్రవారం(నవంబర్ 21) స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్లో జరిగిన అతిపెద్ద సంస్కరణలుగా భావిస్తున్న నాలుగు కీలక లేబర్ కోడ్లను (Labor Codes) కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అధికారికంగా అమల్లోకి తెచ్చింది. వేతనాల కోడ్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), సోషల్ సెక్యూరిటీ కోడ్ (2020), మరియు ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్ (2020).. ఈ నాలుగు చట్టాలు దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల జీవితాల్లో, కంపెనీల పనితీరులో భారీ మార్పులను తీసుకురానున్నాయి.
ఈ కొత్త చట్టాల ప్రకారం.. ‘వేతనాల కోడ్’ ద్వారా దేశవ్యాప్తంగా కనీస వేతనం (National Floor Level Minimum Wage) రోజుకు రూ. 300గా నిర్ణయించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవచ్చు. ప్రధానంగా జీతాలు ఆలస్యం కాకుండా సకాలంలో చెల్లించడం యాజమాన్యాల బాధ్యతగా మారింది. బోనస్, ఓవర్ టైం వంటి అంశాల్లో స్పష్టతనిస్తూ, వేతనాల ఎగవేతకు ఈ చట్టం చెక్ పెడుతుంది. ఇక ‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ నిజంగా ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. చరిత్రలో తొలిసారిగా గిగ్ వర్కర్లు (Zomato, Swiggy, Ola, Uber వంటి ప్లాట్ఫామ్ ఉద్యోగులు) కూడా ఈఎస్ఐ (ESIC), పీఎఫ్ (EPFO) పరిధిలోకి వస్తారు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలకు కూడా సామాజిక భద్రత లభిస్తుంది. ఉద్యోగం మారినా లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళినా సోషల్ సెక్యూరిటీ నంబర్ పోర్టబిలిటీ సౌకర్యం ఉండటం విశేషం.
మరోవైపు ‘ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్’ పరిశ్రమలకు ఊరటనిచ్చింది. 300 మంది వరకు కార్మికులు ఉన్న కంపెనీలు ప్రభుత్వం అనుమతి లేకుండానే లేఆఫ్స్, రిట్రెంచ్మెంట్ లేదా మూసివేత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు (గతంలో ఈ పరిమితి 100 మంది వరకే ఉండేది). అలాగే ట్రేడ్ యూనియన్ల గుర్తింపును సరళీకృతం చేశారు. ఇక ‘ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్’ ద్వారా పని ప్రదేశంలో భద్రతకు పెద్దపీట వేశారు. రోజువారీ పనిగంటలను 8 గంటలకు పరిమితం చేయడం, వలస కార్మికులకు ఉచిత హెల్త్ చెకప్స్, పెద్ద కంపెనీల్లో క్రెచ్ (Creche) సౌకర్యం తప్పనిసరి చేశారు. ‘ఫ్యాక్టరీ’, ‘వర్కర్’ అనే పదాలకు ఏకీకృత నిర్వచనాన్ని ఇచ్చారు.
ఈ సంస్కరణలు అటు ఉద్యోగులకు, ఇటు యాజమాన్యాలకు ఇద్దరికీ లాభదాయకమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులకు భద్రత, సరైన వేతనం లభిస్తుంటే.. యాజమాన్యాలకు ‘వన్ రిజిస్ట్రేషన్, వన్ రిటర్న్’ విధానం ద్వారా పేపర్ వర్క్ గణనీయంగా తగ్గుతుంది. 2015లో కేవలం 19 శాతంగా ఉన్న సామాజిక భద్రత, 2025 నాటికి 64 శాతానికి పెరిగింది. నేటి ఈ కొత్త చట్టాల అమలుతో అది మరింత పెరిగి, భారత్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది.
Read Also: Chicken Price: కార్తీక మాసం ముగింపు: కళకళలాడుతున్న మాంసం దుకాణాలు.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!