దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరాపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ప్రస్తుతం భారత్లో ఎల్పీజీ నిల్వల విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం భారీ భరోసా ఇచ్చింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు సృష్టించిన భయాలను పటాపంచలు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మునుపటితో పోలిస్తే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 40 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. స్వదేశీ వనరుల వినియోగం పెరగడం వల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అయింది. నందాదేవి, శివాలిక్ వంటి కీలక ప్లాంట్ల నుంచి నిరంతరాయంగా ఆన్ లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేంద్రాల నుంచి గ్యాస్ పంపిణీ వేగవంతం కావడంతో అన్ని ప్రాంతాలకు సిలిండర్లు సకాలంలో చేరుతున్నాయి.
అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత్కు వస్తున్న నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన కేంద్రం ఆ ప్రాంతంలో ఉన్న 22 భారతీయ ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వీటిలో ఎల్పీజీ, ముడి చమురు నిండిన వెస్సల్స్ ఉన్నాయి. ఈ ట్యాంకర్ల ప్రయాణం సజావుగా సాగేలా అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. సముద్ర మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేనందున ఇంధన దిగుమతులకు డోకా లేదని ప్రభుత్వం పేర్కొంది.
దేశంలో LPG కొరత లేదన్న కేంద్రం
దేశీయంగా 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచామన్న కేంద్ర ప్రభుత్వం
నందాదేవి, శివాలిక్ నుంచి ఆన్ లోడింగ్ జరుగుతోందని వెల్లడి
హర్మూజ్ దగ్గరున్న 22 ట్యాంకర్లు సేఫ్ గా ఉన్నాయని స్పష్టం
పెట్రోల్, ఎల్పీజీపై అసత్య ప్రచారాలు నమ్మొద్దన్న కేంద్రం
The Central… pic.twitter.com/j5UEQkWSH1
— BIG TV Breaking News (@bigtvtelugu) March 18, 2026
పెట్రోల్, ఎల్పీజీ నిల్వలు నిండుకున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కేంద్రం తేల్చిచెప్పింది. వినియోగదారులు అనవసరంగా భయాందోళనలకు గురై గ్యాస్ సిలిండర్లను అధికంగా నిల్వ చేసుకోవద్దని సూచించింది. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని భరోసా కల్పించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.