Terror Alert: భారత్ లో వరుస బాంబు దాడులకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రమూకలు కుట్ర పన్నినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత ఉగ్రసంస్థ లష్కర్ తోయిబా (Lashkar-e-Taiba) ఈ బ్లాస్టులకు వ్యూహారచన చేస్తున్నట్లు పేర్కొన్నాయి. దిల్లీలోని ఎర్రకోట (Red Fort), చాందినీ చౌక్లోని కొన్ని ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ప్రధాన ఆలయాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. ఉగ్రమూకలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED)తో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు స్పష్టం చేశాయి.
పాకిస్తాన్ లోని ఇస్లాబాద్ లో ఫిబ్రవరి 6న జరిగిన బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని లష్కరే భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘దిల్లీలోని ఎర్రకోట ముందు బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నారు. చాందినీ చౌక్ లోని ఒక ఆలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. లష్కరే తోయిబా ఐఈడీని ఉపయోగించి దాడికి కుట్ర పన్నుతోంది. పాక్ మసీదులో జరిగిన బ్లాస్ట్ కు ప్రతీకారం తీర్చుకోవాలని లష్కరే భావిస్తున్నందున.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలను ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని భద్రతా వర్గాలు తెలిపాయి.
దేశంలోని ప్రముఖ ఆలయాలపై ఇప్పటికే లష్కరే తోయిబా నిఘా పెట్టిందన్న అనుమానాలను భద్రతాబలగాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను సైతం భారత నిఘా వ్యవస్థ అప్రమత్తం చేసే అవకాశముంది. కాగా ఎర్రకోట దగ్గరగల మెట్రో స్టేషన్ సమీపంలో గతేడాది నవంబర్ 10న ఓ కారులో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఫిబ్రవరి 13న పాటియాలా హోస్ కోర్టులోని ఎన్ఏఐ ప్రత్యేక న్యాయస్థానం.. దర్యాప్తు వ్యవధిని మరో 45 రోజులు పొడిగించింది. అదే సమయంలో ఏడుగురు నిందితుల జ్యూడిషియల్ కస్టడీని మార్చి 13 వరకూ పొడిగించింది.
Also Read: Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 6న పాక్ లోని మసీదు సమీపంలో జరిగిన అత్మాహుతి దాడిలో ఏకంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ లోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న షియా వర్గానికి చెందిన మసీదు ప్రధాన ద్వారం వద్ద ఈ బ్లాస్ట్ చోటుచేసుకుంది. సూసైడ్ బాంబర్ మసీదులోకి వచ్చేందుకు యత్నించగా.. అతడ్ని గార్డులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జనం అతడి చుట్టూ గుమిగూడారు. దీంతో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకొని భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాడని పాక్ మీడియా పేర్కొంది.
Also Read: Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు