War Impact on India: ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తలు రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేస్తుంటే.. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అయితే నానాటికి ముదురుతున్న యుద్ధ పరిస్థితులు.. భారత్ పై పెను ప్రభావం చూపొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సామాన్యుడి నెత్తిన ఈ యుద్ధం గుడిబండలా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ యుద్ధం భారత్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది? ధరలు ఏ విధంగా పెరగనున్నాయి? భారత్ కు సొంతంగా చమురు నిల్వలు లేవా? ఒకవేళ ఉంటే వాటి పరిస్థితేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
యుద్ధం ముదిరితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు బ్యారెల్కు 100 డాలర్ల నుండి 140 డాలర్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతున్న భారత్ పై ఇది ప్రభావం చూపనుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరగవచ్చు. ముడిచమురు ధరలో ఒక డాలర్ పెరుగుదల భారత దిగుమతి బిల్లును దాదాపు 2 బిలియన్ డాలర్ల వరకు పెంచుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దేశంలో ఆటోమేటిక్ గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల పప్పులు, కూరగాయాలు, నూనెలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల (బిస్కెట్లు, సబ్బులు వంటివి) ధరలు పెరగొచ్చు. మరోవైపు గ్యాస్ ధరలు (LPG, LNG)సైతం పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 80 శాతం పైగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతూ వస్తోంది. యుద్ధం వల్ల వంటగ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగి ధరలు భారీగా పెరగొచ్చు. అదే జరిగితే హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార పదార్థాల ధరలు సైతం పెరిగే అవకాశముంది.
ప్రపంచంలోని ముడిచమురు రవాణాలో దాదాపు 20%.. ఇరాన్ ఆధీనంలోని అర్బుజ్ జలసంధి గుండానే జరుగుతోంది. భారత్ వచ్చే సరఫరాలో 50 శాతం వరకూ చమురు ఈ మార్గం గుండానే వస్తోంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఏ క్షణమైనా మూసివేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే భారత్ కు వచ్చే చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చు. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 9.5 రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు (విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వద్ద) ఉన్నాయి. చమురు కంపెనీల వద్ద ఉన్న నిల్వలతో కలిపి భారత్ వద్ద సుమారు 25 రోజులకు సరిపడ చమురు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
చమురు నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో భారత్ తన దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా నుండి కొద్దిరోజుల పాటు చమురును దిగుమతి చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రష్యా చమురు విషయంలో భారత్ కు భరోసా కల్పించింది. భారత్ అవసరాలకు తగినంత క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. మరోవైపు అర్బుజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా చమురు తరలించే మార్గాలను సైతం భారత్ అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా గల్ఫ్ దేశాల నుండి ఎర్ర సముద్రం (Red Sea) పోర్టుల ద్వారా పైప్లైన్ల సాయంతో చమురును తరలించే మార్గాలను అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: 108MP Phones Under Rs15k: 16GB ర్యామ్, 108MP కెమెరా ఫోన్స్.. రూ.15000లోపు బడ్జెట్లో బెస్ట్ ఇవే
భారతదేశానికి చమురును వెలికితీసే సాంకేతికత, కంపెనీలు (ONGC, Oil India)ఉన్నాయి. కానీ కొన్ని భౌగోళిక, సహజ పరిమితులు ఇందుకు అడ్డుగా మారాయి. భారత భూభాగంతో పాటు సముద్ర గర్భంలో ముడిచమురు నిల్వలు మన అవసరాలకు సరిపడినంత లేవు. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాలలో కేవలం 11- 12 శాతం మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా 88% పైగా చమురును విదేశాల నుండే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చమురుపై ఆధారపడటం తగ్గించడానికి భారత్ ప్రస్తుతం ఇథనాల్ బ్లెండింగ్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ వంటి రంగాలపై వేగంగా పెట్టుబడులు పెడుతోంది. కానీ ఇప్పటికిప్పుడు వీటి ద్వారా లాభం పొందటం కష్టమే.
Also Read: Loan Harassment: లోన్ రికవరీ కోసం మిమ్మల్ని వేధిస్తున్నారా?.. భయపడొద్దు.. ఇలా చేయండి..!