Loan Harassment: స్వేచ్ఛ బ్యూరో: ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు.. నో డాక్యుమెంటేషన్.. నిమిషాల్లోనే లోన్ మంజూరు చేస్తామంటూ ఊదరగొట్టి అప్పులిస్తున్న ఆన్ లైన్ ప్లాట్ ఫాంలు ఆ తరువాత అసలు స్వరూపాన్ని చూపిస్తున్నాయి. తీసుకున్న రుణం తీర్చేసినా మరింత డబ్బు కట్టాలని.. వాయిదా చెల్లించటంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు దిగుతున్నారు. బంధుమిత్రుల్లో మీ పరువు తీస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కొన్ని బ్యాంకులు సైతం రికవరీ ఏజెంట్లను పంపిస్తూ అప్పు తీసుకున్న వారిని ఇలాగే వేధిస్తుండటం. ఇక, వడ్డీ వ్యాపారులు కూడా అధిక మిత్తీలకు అప్పులిస్తూ ఇదే తరహాలో మానసిక హింసకు గురి చేస్తున్నారు. అయితే, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల లోన్ రికవరీ ఏజెంట్లు, వడ్డీ వ్యాపారులు చేసే బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కు భయపడాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ బాధితులు న్యాయ సహాయాన్ని పొందవచ్చన్నారు.
పిల్లల చదువుల కోసమో.. పెళ్లిళ్లు చేయటానికో.. కొత్త ఇల్లు కొనుక్కోవటానికి లక్షల మంది వేర్వేరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే విషయం అందరికీ తెలిసిందే. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టుకుని.. ష్యూరిటీలు తీసుకుని ఆయా బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తుంటాయి. అయితే చెప్పిన తేదీకి వాయిదా కట్టకపోయినా.. రెండు మూడు నెలలపాటు లోన్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించక పోయినా రుణం తీసుకున్న వారికి బెదిరింపులు మొదలవుతున్నాయి. దీనికి కారణం చాలా బ్యాంకులు లోన్ రికవరీని ఔట్ సోర్సింగ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించటం. ఈ ప్రైవేట్ ఏజెంట్లు వేళాపాళా లేకుండా ఇంటికి వచ్చి నలుగురిలో పరువు పోయేలా గొడవలు పెట్టుకోవటం.. ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండటం సర్వసాధారణంగా మారింది. అక్కడితో ఆగకుండా ష్యూరిటీ ఇచ్చిన వారికి కుడా ఫోన్లు చేస్తున్న ఏజెంట్లు వారిని కూడా రకరకాలుగా వేధిస్తున్నారు. లోన్ కట్టేలా చూడకపోతే మీకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భయపెడుతున్నారు.
ఇక ఫైనాన్స్ యాప్ల వ్యవహారం మరీ దారుణంగా ఉంటోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ఈ సంస్థలు 2వేల నుంచి లోన్లు ఇస్తున్నాయి. దాంతో అత్యవసర సమయాల్లో చాలామంది చిన్న చిన్న మొత్తాలకు కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే, లోన్ మంజూరు చేయటానికి ముందు ఈ సంస్థలు అవతలి వ్యక్తి కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్, ఫోటో గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటున్నాయి. చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా రికవరీ ఏజెంట్లు చేస్తున్న వేధింపులకు హద్దే ఉండటం లేదు. కొన్నిసార్లు పూర్తిగా లోన్ చెల్లించినా మరింత డబ్బు కట్టాలని ఈ ఏజెంట్లు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు.
మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపిస్తూ తాము చెప్పినట్టుగా డబ్బు కట్టకపోతే వాటిని మీ కాల్ లిస్టులో ఉన్న అందరి నెంబర్లకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులైతే వడ్డీల పేర తమ వద్ద అప్పు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. అవతలి వారి అవసరాన్నిబట్టి 3 నుంచి 7శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. ఇచ్చే ముందు ఖాళీ స్టాంప్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుంటున్నారు. కొన్నిసార్లు ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసేసుకుంటున్నారు. ఆ తరువాత అప్పు చెల్లించటంలో ఏమాత్రం అలస్యం జరిగినా మానసికంగా హింసిస్తున్నారు. కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ నివాసి సాయికుమార్ (26)కు ఏడాది క్రితమే పెళ్లయ్యింది. ప్రస్తుతం అతనికి ఓ కూతురు. కాగా, కుటుంబ అవసరాల కోసం ఓ యాప్ నుంచి సాయికుమార్ లక్ష రూపాయలు లోన్ గా తీసుకున్నాడు. తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించినా ఇంకా డబ్బు కట్టాలని యాప్ ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. ఆయన భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దాంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఘట్ కేసర్ మండలంలోని కొండాపూర్ లో ఉన్న ఓ వెంచర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాంనగర్కు చెందిన ప్రేంకుమార్ కొంతకాలం క్రితం ఓ లోన్ యాప్ నుంచి 3వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, దానిని చెల్లించ లేకపోయాడు. దాంతో రికవరీ ఏజెంట్లు వరచూ ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడటంతోపాటు నీ బంధుమిత్రుల్లో పరువు తీస్తామని భయపెట్టారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రేం కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు అతని భార్య నాగవేణి ఫిర్యాదు చేయగా చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: Hyderabad Fire Accident: హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం.. బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు
వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి 57లక్షలు అప్పు చేసిన అంబర్ పేట బాపూనగర్ ప్రాంత నివాసి రాంరాజ్ కూడా ఇదే కారణంతో భార్య, కుమారునితో కలిసి ప్రాణాలు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుతో పెట్టిన రెండు హోటళ్లు నడవక పోవటం, వడ్డీలు పెరిగిపోవటంతో రాంరాజ్ దానిని తీర్చలేకపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వాళ్లు తరచూ ఇంటి వద్దకు వచ్చి గొడవలు పడుతుండటం, ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉదంతంలో అంబర్ పేట పోలీసులు నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు.
అయితే, బ్యాంకులు, లోన్ యాప్ ల రికవరీ ఏజెంట్లుగానీ, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులుగానీ వేధింపులకు పాల్పడితే భయపడి ప్రాణాలు తీసుకోవద్దని సీనియర్ న్యాయవాది రాహుల్ చెప్పారు. ఇలాంటి వారు న్యాయ సహాయం పొందవచ్చన్నారు. గతనెల 3న శాంతిప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఈ మేరకు స్పష్టమైన తీర్పునిచ్చిందని చెప్పారు. రికవరీ ఏజెంట్లు బాధితుని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. రికవరీ ఏజెంట్లకు క్రమశిక్షణ నేర్పకపోతే భారీ జరిమానాలు విధిస్తామని కూడా స్పష్టం చేసిందని చెప్పారు. అప్పు కట్టలేదని ఎవరినైనా మానసికంగా వేధించినా, రికవరీ ఏజెంట్లు గూండాల్లా ప్రవర్తించినా ఆ బ్యాంక్ లేదా సంస్థ లైసెన్స్ ను రద్దు చేసే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుందని పేర్కొందన్నారు.
రికవరీ ఏజెంట్లు ఉదయం 8గంటలకు ముందు రాత్రి 7గంటల తరువాత ఫోన్లు చేయటానికి వీల్లేదని స్పష్టంగా చెప్పిందని తెలిపారు. అనుమతి తీసుకోకుండా ఇండ్ల వద్దకు వెళ్లొద్దని పేర్కొందని వివరించారు. ఎవరైనా వేధిస్తే మాటలు రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్టు చెప్పారు. నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు కూడా కంప్లయింట్ ఇవ్వొచ్చని చెప్పిందన్నారు. అవుట్ సోర్సింగ్ చేసినంత మాత్రాన ఏజెంట్లు చేసే అక్రమాలకు బ్యాంకులు బాధ్యత వహించక్కర్లేదని అనటం కుదరదని స్పష్టం చేసినట్టు చెప్పారు. ఏజెంట్లు బూతులు తిడితే బీఎన్ఎస్ సెక్షన్ 296, బెదిరిస్తే సెక్షన్ 351 ప్రకారం కేసులు నమోదు చేయవచ్చని తెలిపిందన్నారు. అప్పు తీసుకోవటం నేరం కాదు..అది ఒక ఒప్పందం మాత్రమే..రికవరీ అనేది చట్టబద్దమైన పద్దతిలో జరగాలి తప్పితే భయపెట్టి కాదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలియ చేసిందని వివరించారు.
Also Read: Stree Nidhi MD: శ్రీనిధిలో సిత్రాలు.. 14 ఏళ్ల నుండి ఓకే వ్యక్తి ఎండీగా విధులు..?