Jairam Ramesh: ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరావళి శ్రేణికి సంబంధించి కేంద్రం ఆమోదించిన కొత్త నిర్వచనం పర్యావరణ నిపుణుల అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైన, వినాశకరమైన నిర్ణయమని ఆయన మండిపడ్డారు.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) డేటాను ఉటంకిస్తూ జైరాం రమేష్ కేంద్రం తీరును ఎండగట్టారు. ఎఫ్ఎస్ఐ ప్రామాణిక గణాంకాల ప్రకారం.. 20 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఆరావళి కొండలలో కేవలం 8.7 శాతం మాత్రమే 100 మీటర్ల కంటే ఎత్తు ఉన్నాయి. మొత్తం ఆరావళి కొండలను పరిగణనలోకి తీసుకుంటే, కనీసం 1 శాతం కూడా 100 మీటర్ల ఎత్తును మించవు. ఇలా ఎత్తును ప్రామాణికంగా తీసుకుని సరిహద్దులను నిర్ణయించడం అవివేకమని, ఎత్తుతో సంబంధం లేకుండా ఆరావళి శ్రేణి మొత్తాన్ని రక్షించాల్సిందేనని ఎఫ్ఎస్ఐ స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిర్వచనం వల్ల వైశాల్యం పరంగా 90 శాతానికి పైగా ఆరావళి ప్రాంతం చట్టపరమైన రక్షణను కోల్పోతుందని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా మైనింగ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆరావళి కొండలను అప్పగించడమేనని విమర్శించారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఈ పర్యావరణ వ్యవస్థను ఈ నిర్ణయం మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యావరణ సమతుల్యతపై వ్యవస్థీకృత దాడి చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలను సడలించడం, అటవీ చట్టాలను బలహీనపరచడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వంటి సంస్థలను నిర్వీర్యం చేయడం ఇందులో భాగమేనన్నారు. అంతర్జాతీయ వేదికలపై పర్యావరణ పరిరక్షణ గురించి ప్రధాని మోదీ ఇచ్చే గొప్ప ఉపన్యాసాలకు, దేశంలో వాస్తవంగా జరుగుతున్న విధ్వంసానికి మధ్య ఏమాత్రం పొంతన లేదని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
Read Also: AI Water Consumption: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ