KNRUHS: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS)లో విజిలెన్స్ అధికారులు సంచలన తనిఖీలు చేపట్టారు. వైద్య విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల మార్కులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు పీజీ పరీక్షలలో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులకు రీకౌంటింగ్ ప్రక్రియలో అక్రమంగా పాస్ మార్కులు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా తనిఖీ చేస్తున్నారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస రావు నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది.
విజిలెన్స్ అధికారుల తనిఖీలో పరీక్ష పేపర్ల వాల్యుయేషన్లో స్పష్టమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కొంతమంది అనర్హులైన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు మార్కులలో మార్పులు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు ఇతర డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ సాగుతోంది.
విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో జరిగిన ఈ గోల్ మాల్తో విద్యార్థులు విద్యావేత్తలలో తీవ్ర చర్చ జరుగుతోంది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేవారికి అన్యాయం జరిగిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారుల నివేదిక ఆధారంగా యూనివర్సిటీ పాలకవర్గం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
స్పందించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్
కాళోజీ హెల్త్ యూనివర్సిటలో మార్కుల గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి తెలిపారు. దాదాపు 150 మంది వైద్య విద్యార్థులు తమ మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రీకౌంటింగ్లో ఎవరూ పాస్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రికార్డుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలలో అక్రమాలు జరిగినట్లు తేలితే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి హెచ్చరించారు.