Modi: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందంటూ తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర నిఘా వర్గాలను ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి తమ నాయకులను అక్రమంగా కేసుల్లో ఇరికించారని అన్నారు. బీజేపీలో చేరిన అవినీతి రాజకీయ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
2014 నుంచి దర్యాప్తు సంస్ధలు చేస్తున్న దర్యాప్తులు, అరెస్టుల్లో ఎక్కువ శాతం ప్రితిపక్షాల వారివే ఉన్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా.. రాజకీయ కుట్రలో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ చేత అరెస్ట్ చేయించారని ధ్వజమెత్తారు. ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ని తీర్చిదిద్దడం ద్వారా మనీశ్ సిసోడియాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనీ.. బీజేపీ పాలనతో దేశ ప్రజాస్వామ్య విలువలు పడిపోతుండటాన్ని ప్రపంచం చూస్తోందని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, NCP అధినేత శరద్ పవార్, అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన UBT నేత ఉద్ధవ్ థాక్రే, ఆప్ నేత భగవంత్ మాన్, JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, RJD నేత తేజస్వీ యాదవ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.