Madurai-Rameswaram train: రామేశ్వరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులు టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి పారిపోయారు.
పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో రైల్వే తనిఖీ అధికారులకు చుక్కలు చూపించారు కొందరు యాత్రికులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది యాత్రికులు మధురై-రామేశ్వరం ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. అయితే.. వీరిలో అత్యధికులు టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.
రైలు రామేశ్వరం స్టేషన్కు చేరుకోగానే రైల్వే టీటీఈలు, భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సుమారు 100 మందిని పట్టుకున్న అధికారులు వారి నుండి 25 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. ఇది గమనించిన మిగిలిన 200 మంది ప్రయాణికులు జరిమానా నుండి తప్పించుకోవడానికి ఒక వినూత్న ఎత్తుగడ వేశారు.
అందరూ ఒక్కసారిగా గుంపుగా చేరి “ఛత్రపతి శివాజీ జిందాబాద్”, “జై హో” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్టేషన్ బయటకు పరుగులు తీశారు. అధికారుల దృష్టిని మళ్లించి, వారిని గందరగోళానికి గురిచేయడానికే యాత్రికులు ఈ రకమైన నినాదాలతో కూడిన డ్రామా ఆడారని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
నియమ నిబంధనలు పాటించకుండా.. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో ఇలాంటి అరాచకాలకు పాల్పడటంపై స్థానిక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ALSO READ: Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?