Maharashtra Civic Body Polls-2026: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం మొదలైంది. ఆ రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2869 స్థానాలకు ఉదయం మొదలైన పోలింగ్, సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 16 వేల మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దాదాపు 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
దేశంలో అత్యంత ధనిక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్-BMC పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అక్కడ నాలుగేళ్లు ఆలస్యం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి గంటల్లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముంబైలో రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఒకే తాటి మీదకు వచ్చారు. బీజేపీ కూటమి- కాంగ్రెస్ కూటమి మధ్య పోరు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈసారి చొరబాటు, మరాఠీ గుర్తింపు, హిందూత్వ వంటి అంశాలపై ప్రచారం సాగింది. ఓ వైపు బీజేపీ మిత్ర పక్షాలైన శివసేన షిండే, ఎన్సిపి అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేస్తున్నాయి.
ఓటేసిన ప్రముఖులు.. అందరి చూపు ముంబై-పూణెలపై
ఇటు కాంగ్రెస్ మిత్ర పక్షాలైన ఠాక్రే వర్గం శరద్ పవార్లతో కూడిన ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నెలకొంది. ఈసారి రాజ్థాకరేకు చెందిన ఎంఎన్ఎస్ అనేక స్థానాల్లో ‘కింగ్ మేకర్’ కావచ్చని తెలుస్తోంది. ఈ ఎన్నికల కోసం ఉద్ధవ్ ఠాక్రే-రాజ్ ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. మిగతా కార్పొరేషన్లతో పోలిస్తే బృహన్ ముంబై మంబై మున్సిపల్ కార్పొరేషన్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
227 స్థానాల్లో 1700 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శుక్రవారం అంటే జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముంబై, పూణె నగరాల్లో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో సినీ, రాజకీయ, క్రికెటర్లు, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాంధీ శిక్షణ్ భవన్ పోలింగ్ స్టేషన్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ALSO READ: శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మరక జ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు
మరోవైపు మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రముఖులు ఓటు వేశారు. వారిలో నాగ్పుర్లోని మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పుణెలో ఓటు వేశారు. కేంద్రమంత్రి మురళీధర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.