హరిహర సుతుడు, కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం మకర సంక్రాంతి పర్వదినం వేళ భక్తజన సంద్రమైంది. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు మారుమోగాయి. శనివారం సాయంత్రం పొన్నాంబలమేడు పర్వత శిఖరాలపై మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.
మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా పందాళం రాజప్రసాదం నుంచి శనివారం సాయంత్రం తిరువాభరణాల ఊరేగింపు శబరిమలకు చేరుకుంది. ఈ ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం మూలమూర్తికి మహా హారతి ఇచ్చారు. ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
సరిగ్గా సూర్యాస్తమయం సమయంలో ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న పొన్నాంబలమేడు పర్వతశ్రేణుల నుంచి దివ్యమైన జ్యోతి దర్శనమిచ్చింది. క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ వెలుగులీనుతున్న ఆ జ్యోతిని చూడగానే భక్తులందరూ భక్తిపారవశ్యంతో చేతులెత్తి మొక్కుతూ స్వామి నామస్మరణ చేశారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి అయ్యప్ప స్వామికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి కొండలపై నిరీక్షించారు. సన్నిధానం, మాళికాపురం, పాండితావళం వంటి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మకరజ్యోతి దర్శనంతో శబరిమల యాత్రలో అత్యంత ప్రధాన ఘట్టం ముగియడంతో భక్తులు తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.
ALSO READ: Medaram Jathara: మేడారంలో మొదలైన జాతర సందడి.. పోటెత్తిన భక్త జనసంద్రోహం