Eknath Shinde helicopter escape: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి.. అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ముప్పు తప్పింది. జుహులోని పవన్ హన్స్ హెలిప్యాడ్లో హెలికాప్టర్ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అధికారులు.. పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం షిండేతో పాటు విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని షిండే కార్యాలయం పేర్కొంది.
తన పార్టీ కార్యకర్త కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు షిండే ముంబై నుంచి ముర్బాద్కు ప్రయాణిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు మహాలక్ష్మి రేస్కోర్స్ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఐరోలి పరిసర ప్రాంతాలకు చేరుకోగానే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించాయి. గాలిలో తీవ్రమైన తుఫాను ఏర్పడటాన్ని పైలట్ గుర్తించారు.
ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించిన పైలట్ వెంటనే విషయాన్ని డిప్యూటీ సీఎంకి వివరించారు. ఆ ముప్పును పసిగట్టి ప్రయాణాన్ని కొనసాగించకుండా వెనక్కి మళ్లాలని సూచించారు. షిండే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్ మార్గాన్ని మార్చి.. కొద్ది నిమిషాల్లోనే పవన్ హన్స్ హెలిప్యాడ్లో సురక్షితంగా దించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్ తన నిర్దేశిత మార్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విమానయాన వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం ఉందా లేక కేవలం వాతావరణ పరిస్థితులే కారణమా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు తప్పినప్పటికీ.. షిండే తన పర్యటనలో మార్పులు చేసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Also: తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?