KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడి చేయడం దుర్మార్గం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ దాడిని హేయమైనదిగా అభివర్ణించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కమలాకర్ తో ఫోన్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ కు బీ-టీంగా మారిన బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
Also Read: BSNL మరో క్రేజీ ప్లాన్.. 3 నెలల పాటు.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్!
అంతకుముందు తనపై జరిగిన దాడిని పాడి కౌషిక్ రెడ్డి ఖండించారు. కొందరు బీజేపీ నాయకులు గుండాలను పెట్టుకొని తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. “నిజాలు మాట్లాడితే దాడులు చేస్తారా? నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని అడిగితే అది దాడిగా ఎలా మారుతుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు. తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ భిన్నాభిప్రాయాలను హింసతో అణగదొక్కడాన్ని ప్రజాస్వామ్యం ఒప్పుకోదన్నారు. తనపై దాడి చేసిన వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.