ED Raids in West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ముగిసిన వారం రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగడంతో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారం, హార్డ్ డిస్క్లు, అభ్యర్థుల జాబితాలను ఈడీ స్వాధీనం చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఓటర్ల జాబితాల సవరణ, దర్యాప్తు సంస్థల దాడుల వ్యవహారం బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది.
కోల్కతాలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) కార్యాలయంపై ఈడీ దాడులు రాజకీయ దుమారం రేపాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీకి వ్యూహకర్తగా ఐప్యాక్ వ్యవహరిస్తోంది. దాడుల విషయం తెలిసిన వెంటనే సీఎం మమతా బెనర్జీ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని విపక్షాలను బెదిరిస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ముంగిట కావాలనే కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. “దేశాన్ని రక్షించలేని ఓ నీచమైన, దుర్మార్గపు హోంమంత్రి… నా పార్టీ పత్రాలన్నింటినీ తీసుకెళ్తున్నారు.” అంటూ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షా బెంగాల్లో పర్యటించి వెళ్లిన వారం రోజుల్లోనే ఈడీ రంగప్రవేశం చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె మండిపడ్డారు.
కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంపై జరిగిన సోదాల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా ఖండించింది. తాము ఏ రాజకీయ పార్టీని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోవడం లేదని, కేవలం లభించిన బలమైన ఆధారాల మేరకే సోదాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో 6, ఢిల్లీలో 4 సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని, ఇవి అక్రమ బొగ్గు స్మగ్లింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సాధారణ ప్రక్రియలో భాగమేనని తెలిపింది. ఏ పార్టీ కార్యాలయాల్లోనూ సోదాలు జరగడం లేదని, ఈ సోదాలకు రాబోయే ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు.
చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి కఠినంగా సోదాలు నిర్వహిస్తుంటే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోదాలు జరుగుతున్న పది ప్రాంతాల్లోని రెండు చోట్లకు వారు అక్రమంగా చొరబడి, అధికారుల విధులకూ ఆటంకం కలిగిస్తూ పత్రాలను బలవంతంగా లాక్కున్నారని పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా జోక్యం చేసుకోవడం సరికాదని ఈడీ పరోక్షంగా మమతా తీరును తప్పుబట్టింది.