Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై జైలులో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోడియా శనివారం జైలు నుంచి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లారు. కానీ తన సతీమణిని మాత్రం కలుసుకోలేకపోయారు.
ఆప్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిసోడియా సతీమణి సీమా అనారోగ్యానికి గురికావడంతో శనివారం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే ఉదయం 9.38 గంటలకు సిసోడియా మథురా రోడ్డులోని ఇంటికి వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను తీసుకెళ్లారు. అయితే అప్పటికే సిసోడియా భార్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన తన భార్యను చూడలేకపోయారని అని ఆప్ వర్గాలు తెలిపాయి.
సిసోడియా భార్య సీమా ఆటోఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గతంలోనూ క్షీణించింది. గత నెలలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో భార్యను చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. కుమారుడు వేరే దేశంలో చదువు కుంటున్నాడని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని సిసోడియా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు భార్యను చూసేందుకు అనుమతి ఇచ్చింది.
శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోడియా తన ఇంటికెళ్లి భార్య సీమాను చూసిరావొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన వెంట ఎలాంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్లొద్దని ఆదేశించింది. మీడియాతోనూ మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి సిసోడియా మాత్రం భార్యను చూడలేకపోయారు.