
Death Threat : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ పంపించారు. దేశంలో మంచి షూటర్లకు కొదవలేదని, ఆయన్ని కాల్చి చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముకేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.
ఇంతకుముందు కూడా ముకేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం టెన్షన్ రేపుతోంది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామని శుక్రవారం ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్దేవి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.