Arava Sridhar: జనసేన పార్టీ నియమించిన విచారణ కమిటీ ముందు హాజరైన అనంతరం రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలు మరియు పార్టీ కమిటీ విచారణకు సంబంధించి మాట్లాడుతూ..పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి తనకు సంబంధించిన పూర్తి వివరణను అందించానని శ్రీధర్ తెలిపారు. అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు, ఇతర ఆరోపణలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా, తన వాదనకు మద్దతుగా అవసరమైన ఆధారాలను (Proofs) కూడా కమిటీకి సమర్పించినట్లు వెల్లడించారు.
పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నుంచి, కమిటీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తాను మళ్లీ ప్రజల్లోకి వస్తానని, అప్పటివరకు వేచి చూస్తానని పేర్కొన్నారు. ఈ వివాదం పూర్తిగా ఒక వ్యక్తికి, తనకు మధ్య జరిగిన వ్యక్తిగత విషయం అని, దీనిని దయచేసి రాజకీయ పార్టీలకు రుద్దవద్దని ఆయన కోరారు. ముఖ్యంగా జనసేన పార్టీ పేరును ఈ వివాదంలోకి లాగవద్దని, వ్యక్తిగత విషయంగానే తాను కమిటీకి సమాధానం ఇచ్చానని చెప్పారు.
తనపై ఇప్పటికే నమోదైన లేదా భవిష్యత్తులో నమోదు కాబోయే ఎన్ని కేసులనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని శ్రీధర్ ప్రకటించారు. చట్టపరంగా మరియు కోర్టుల ద్వారా తన నిజాయితీని నిరూపించుకుంటానని, వంద కేసులు పెట్టినా భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు.కమిటీ తన నివేదికను పార్టీకి సమర్పించి, పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తాను మళ్ళీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు. ఆ సమయంలో మీడియా మిత్రులందరికీ ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా విడమర్చి చెప్తానని ఆయన హామీ ఇచ్చారు.