Car Bomb: స్వేచ్ఛ బ్యూరో: దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో సంచలన వివరాలు వెలుగు చూశాయి. ఈ కేసుపై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో నిందితులు బాంబులను తయారు చేయటానికి అవసరమైన సమాచారాన్ని చాట్ జీపీటీ, యూ ట్యూబ్ నుంచి సేకరించినట్టుగా తెలిపారు. 2025, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో ఉగ్రవాదులు కారు బాంబును పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకంలో 11మంది మృత్యువాత పడ్డారు. దీనిపై కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా అనుబంధ విభాగం అన్సార్ గజ్వా ఉల్ హింద్ కు చెందిన ఉగ్రవాదులు ఈ పేలుడు జరిపినట్టుగా నిర్ధారించుకున్నారు.
ఈ ఉగ్రవాద ముఠాలో ఇన్ హౌస్ ఇంజనీర్ గా వ్యవహరించిన జాసిర్ బిలాల్ అనే నిందితుడు బాంబులు ఎలా తయారు చేయాలి? ఏ నిష్పత్తిలో రసాయనాలు కలపాలి అన్న వివరాలను చాట్ జీపీటీ, యూ ట్యూబ్ లలో సెర్చ్ చేసి తెలుసుకున్నట్టుగా కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. స్థానికంగా దొరికే పొటాషియం నైట్రేట్ వంటి వస్తువులను ఉపయోగించి ఐఈడీ బాంబులను తయారు చేశాడని తెలిపారు. రాకెట్ బాంబులను తయారు చేసి జమ్మూ కాశ్మీర్ లోని ఖాజీగుండ్ అడవుల్లో టెస్ట్ కూడా చేసినట్టుగా పేర్కొన్నారు.
Also read: ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
అడవుల్లో రాకెట్ బాంబులను టెస్ట్ చేసిన ప్రాంతాల నుంచి విడిభాగాలు, కెమికల్ శాంపిళ్లను రికవరీ చేసినట్టుగా తెలియచేశారు. బాంబులను పేల్చటానికి కావాల్సిన ట్రిగ్గర్ల మెకానిజం కోసం జాసిర్ తన ఫ్లిప్ కార్డ్ అకౌంట్ ను ఉపయోగించినట్టుగా తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి మధ్య సెన్సార్ స్విచ్లు, హీట్ గన్, రిమోట్ కంట్రోల్ రిలే స్విచ్ లు, సాల్డరింగ్ కిట్లు, రీ ఛార్జబుల్ లైటర్లను క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా తెప్పించుకున్నట్టుగా పేర్కొన్నారు. అవసరమైన డబ్బును డాక్టర్ ఉమర్ సమకూర్చినట్టుగా తెలిపారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి.. రాంచందర్ రావు బహిరంగ లేఖ..!