Godavari Waters: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు డిజైన్ల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అయితే, గత రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలను, సిఫార్సులను అమలు చేయడంలో తీవ్ర ఆలస్యం చేస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయని, తద్వారా తెలంగాణ ప్రజలు సుమారు 200 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇకపోతే.. సీతారామ ప్రాజెక్టకుకు కేంద్ర ప్రభుత్వం, సాంకేతిక సలహా కమిటీ నుంచి అన్ని అనుమతులు లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. దీనివల్ల 67 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అలాగే సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం 47 టీఎంసీల హైడ్రాలాజికల్ అనుమతి ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కమాండ్ ఏరియాను గుర్తించడంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సాంకేతిక సలహా కమిటీ అనుమతులు ఆలస్యమవుతున్నాయన్నారు.
Also Read: ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులతో చేపట్ట తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు పరిధిని మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలపై రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఇంచంపల్లి నుంచి కాకుండా నాగార్జున సాగర్కు మార్చాలని చూస్తే అది తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల ప్రణాళికలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: మళ్లీ సెంటిమెంట్తో గెలవాలనుకుంటున్నావా కేటీఆర్.. బీజేపీ గట్టి కౌంటర్..!