Patna: బీహార్లో కొత్త ఎన్డీయే సర్కార్ కొలువు దీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.
బీహార్లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్
బీహార్లో కొత్తగా ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణం చేయించారు. పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు.వారిలో సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. వీరిద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు అప్పగించినట్టు తెలుస్తోంది.
జేడీయూ పార్టీకి చెందిన విజయ్కుమార్ చౌదరి, బిజేంద్రప్రసాద్ యాదవ్ శ్రావణ్ కుమార్, బీజేపీకి చెందిన మంగళ్పాండే, దిలీప్కుమార్ జైస్వాల్, నితిన్నబిన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా వంటివారు హాజరయ్యారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఇది పదోసారి
బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. ఎన్నిక తర్వాత ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ వద్దకు వెళ్లి తన రాజీనామా సమర్పించారు నితీష్కుమార్. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించి ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు అందజేసిన విషయం తెల్సిందే.
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 అసెంబ్లీ సీట్లకు నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయేకు 202 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. 101 సీట్లలో పోటీ చేసిన బీజేపీ, 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం దక్కించుకుంది.
ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు
నితీష్పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి 14 మంది, జేడీయూ నుంచి 9 మంది ఉన్నారు. అలాగే లోక్ జన్శక్తి-రాంవిలాస్ పార్టీ నుంచి ఇద్దరు, రాష్ట్రీయ లోక్ మోర్చా-ఆర్ఎల్ఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా-హెచ్ఏఎం నుంచి ఒక్కొక్కరు మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు.
మరోవైపు బీహార్లోని మహాత్మాగాంధీ ఆశ్రమం వద్ద జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ మౌన నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మౌన ఉపవాసం నేపథ్యంలో శతాబ్దం కిందట మహాత్మా గాంధీ స్థాపించిన పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు.