Operation Kagar: భారతదేశం నుండి మావోయిస్టు సాయుధ పోరాటాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్ లైన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో 2024 జనవరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘ఆపరేషన్ కగార్’ సత్ఫలితాలను ఇస్తోంది. గడిచిన కాలంలో సుమారు 2,500 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవగా, 500 మందికి పైగా కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. ఈ నేపథ్యంలో, రేపు అమిత్ షా చేయబోయే అధికారిక ప్రకటనపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి, జార్ఖండ్లోని సారంద అటవీ ప్రాంతాలను క్లియర్ చేయడం ఆపరేషన్లో కీలక మలుపు. దాదాపు 64 ఫార్వర్డ్ బేస్ క్యాంప్ల (FOB) ఏర్పాటు ద్వారా మావోయిస్టుల షెల్టర్ జోన్లను ధ్వంసం చేసి, అక్కడ రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను వేగవంతం చేశారు. ప్రస్తుతం కర్రెగుట్టలు పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారడం భద్రతా దళాల అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.
అయితే మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి ఆచూకీపై ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆపరేషన్ ప్రారంభానికి ముందే ఆయన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినట్లు సంకేతాలు అందుతున్నాయి. గణపతితో పాటు వినోద్, కాంతారావు వంటి కొద్దిమంది కీలక నేతలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నట్లు సమాచారం. అయితే, 2025 జనవరి నుండి గణపతి వర్గం పార్టీతో సంబంధాలు తెంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ SIB బృందాలు ఆయన కదలికలపై నిశిత నిఘా ఉంచాయి.
క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం, మావోయిస్టుల పూర్తి నిర్మూలనకు మరికొంత సమయం అవసరమని భావిస్తున్న భద్రతా దళాలు, మార్చి 31 డెడ్ లైన్ను పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని అత్యంత దుర్భేద్యమైన అబూజ్మాడ్, బస్తర్ అడవుల్లో ఇంకా కొందరు సభ్యులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని ఏరివేసేందుకు మరో విడత గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున, గడువు పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేయబోయే ప్రకటన ద్వారా దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన కొత్త రోడ్ మ్యాప్ వెలువడే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, ఆపరేషన్ కగార్ సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించనున్నారు. దశాబ్దాలుగా దేశాన్ని పీడిస్తున్న నక్సలిజానికి చరమగీతం పాడుతూ, పూర్తి ‘మావోయిస్టు రహిత భారత్’ ప్రకటన వెలువడుతుందా లేదా గడువును పెంచుతారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Also Read: బీహార్ పాలిటిక్స్లో బిగ్ట్విస్ట్.. ఎమ్మెల్సీ పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. ఎందుకంటే?