Dhar Road Accident: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరమశివుని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా తిరుగు ప్రయాణమైన ఒకే సమూహానికి చెందినవారిని విధి ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. బద్నావర్- ఉజ్జయిన్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు, లారీ ఎదురెదురు గా ఢీకొనడంతో ఈ భయంకర దుర్ఘటన జరిగింది.
నుజ్జునుజ్జయిన కారు.. ఆరుగురు అక్కడికక్కడే మృతి
బద్నావర్- ఉజ్జయిన్ రహదారిలోని పంచకవాస వద్ద కారు అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వాహనం వద్దకు చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రక్షించి, హుటాహుటిన బద్నావార్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే బద్నవార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అమిత్ సింగ్ కుష్వా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా కారులోనే మృతదేహాలు చిక్కుకుపోవడంతో, స్థానికుల సహాయంతో అతికష్టం మీద వాటిని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బద్నవార్ సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
గుజరాత్కు చెందిన భక్తులుగా గుర్తింపు
ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందిస్తూ వివరాలు వెల్లడించారు. బాధితులంతా గుజరాత్లోని వడోదర ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఉజ్జయిన్లోని ప్రముఖ మహాకాలేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, తిరిగి వడోదరకు స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించామని ఏఎస్పీ తెలిపారు.
Also Read: నెల్లూరు కంచుకోటపై YCP కన్ను.. పోయిన చోటే పట్టు సాధించేలా బిగ్ ప్లాన్!