సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై జనం విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇది బీజేపీ ఎత్తుగడగా విస్తృత ప్రచారం జరిగింది. అన్ని పార్టీలు ఇక్కడ జనాన్ని చైతన్య పర్చడంలో జరిగే ఉపద్రవాన్ని వివరించే విషయంలో సక్సెసయ్యాయి. ఇక ఇవాళ్టి నుంచి తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలు కానుంది. ఓ నెల రోజుల పాటు ఇది కొనసాగనుంది.
గతంలో 2002లో ఇది చేపట్టారు. ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు చేస్తున్నారు. బోగస్ ఓట్ల ఏరివేత లక్ష్యంగా ఇది కొనసాగనుంది. అయితే గతంలో కన్నా ఇప్పుడు నిబంధనలు జఠిలం చేశారు. పన్నెండు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపినా.. తిరిగి మళ్లీ ఓటును యథాతథంగా కొనసాగించే వీలుంటుంది. కానీ 2002లో ఓటు వేయని వారికి మాత్రం ఇది పెద్ద చిక్కే తెచ్చిపెడుతోంది.
అప్పుడు ఓటు వేయలేదు కాబట్టి..ఆ ఓటరు ఫ్యామిలీకి చెందిన ఓటర్లను మ్యాపింగ్ చేయనున్నారు. ఆ కుటుంబంలో ఎవరో ఒకరు అప్పటి ఓటరు జాబితాలో పేరు నమోదు అయి ఉన్నవారై ఉండాలి. లేకపోతే దీన్ని తొలగించేస్తారు. ఇప్పుడు అలాంటి ఓట్లే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. పేరుకు 12 గుర్తింపు కార్డులని చెబుతున్నా.. 2002 ఓటరు లిస్టును అనుసరించి.. కచ్చితంగా ఫ్యామిలీ మ్యాపింగ్ను చేస్తున్నారు.
అంటే.. అప్పట్నుంచి ఆ కుటుంబం ఈ రాష్ట్రంలో జీవిస్తున్నదై ఉండాలనే సిటిజన్ షిప్ యాక్టు( పౌర సత్వ చట్టం -1955) ప్రకారం ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కోల్పోయేది ఓటు మాత్రమే కాదు. భారత పౌరసత్వాన్ని కూడా. అవును.. ఇక రాష్ట్రంలో రేషన్కార్డుతో పాటు ఏ సంక్షేమ పథకం కూడా అమలు కాని దుస్థితి ఏర్పడుతుంది.
కేంద్రం దీన్ని సిటిజన్ షిప్ యాక్టును లింకు చేసి కఠినతరం చేయడం మూలంగానే ఈ సర్ విధానం మరింత ప్రమాదకరంగా మారింది. పేద, మధ్యతరగతి ఓట్లు చాలా వరకు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఇదే జరిగింది. అక్కడ అధికార మార్పుకి ఇదే బీజం వేసింది.
తనకు కావాల్సిన రీతిలో కేంద్రం దీన్ని వాడుకుని అధికారంలోకి వచ్చిందనే ప్రచారం ముమ్మరమైంది. ఇప్పుడు తెలంగాణలో జరిగే ఈ సర్ ప్రక్రియపై ముందే మేల్కోని చైతన్యవంతంగా ముందుకు సాగే క్రమంలో ప్రధాన పార్టీలు రెండు ముందు వరుసలో ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ.. మైనార్టీ ఓట్ల విషయంలో సర్ చేపట్టే ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉంది.
కాంగ్రెస్కు అనుకూల వర్గాల ఓట్లు పోకుండా బీఎల్వోలను నియమించుకున్నారు. బీఆరెస్ కూడా ఇదే చేస్తోంది. ఎలాగూ రాబోయే ది మేమే.. బీఆరెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే ధీమా నేపథ్యంలో.. ఆ పార్టీ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నది. ప్రజల్లో ఈ హడావుడి కొంత గందరగోళం, అయోమయాన్నైతే సృష్టించింది. ప్రతీ ఒక్కరు బీఎల్వోలు ఇచ్చిన ఫామ్ నింపి.. మళ్లీ తమ ఓటును జాబితాలో పొందుపరుచుకోవాలనే సూత్రంతో అంతా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నారు.
అక్కడ వాకబు చేస్తున్నారు. ఈ నెల రోజుల్లో వారికి కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించి.. నెల తరువాత ప్రకటించే సవరించిన ఓటరు జాబితాలో తమ పేరు వచ్చే వరకు కూడా ఈ టెన్షన్ వారిలో పోయేలా లేదు. అంతలా ఈ సర్ ప్రక్రియ జనాలను భయపెడుతున్నది. పార్టీలు వారికి సంఘీభావంగా ఉన్న ఈ ప్రక్రియ ముగిసే వరకు ఆ భయం వారిని వదలేలా లేదు.