భారత్ కి చెందిన 5 ఫైటర్ జెట్స్ ని కూల్చేశాం -పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
భారత్ సుఖోయ్ యుద్ధ విమానాన్ని పేల్చేశాం, పైలట్ ని ప్రాణాలతో పట్టుకున్నాం -పాక్ సోషల్ మీడియా
పంజాబ్ లోని జలంధర్ పై డ్రోన్ అటాక్ చేశాం – పాక్ అధికరా వర్గాలు
భారత్ లోని ఏటీఎంలు మూడు రోజుల్లో మూతపడబోతున్నాయి – పాక్ సోషల్ మీడియా
ఒకటా రెండా.. వందలాది ఫేక్ న్యూస్ ని పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రచారంలోకి తెస్తోంది. పాకిస్తాన్ పై భారత్ క్షిపణుల వర్షం కురిపిస్తుంటే, పాక్ మాత్రం ఫేక్ న్యూస్ తో భారత్ పై ఎదురుడాది మొదలు పెట్టింది. ఈ ఫేక్ న్యూస్ ని ప్రచారంలోకి తెస్తూ భారత సైన్యం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది పాకిస్తాన్.
సాక్షాత్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారో, అసత్యాలు ప్రచారంలోకి తెస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మన క్షిపణి దాడుల్ని కాచుకునే సత్తా లేదు కానీ, భారత్ కి చెందిన 5 యుద్ధ విమానాల్ని కూల్చేశామని చెప్పుకుంటున్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఈ ఘటనకు సాక్ష్యాలున్నాయా అని అడిగితే మాత్రం మాట దాటేస్తున్నారు. నాయకులే అలా ఉంటే, అధికారులు, పాకిస్తాన్ కి వంతపాడే అక్కడి సోషల్ మీడియా ఇంకెంత దారుణంగా ఫేక్ పోస్ట్ లు పెడతారో అర్థం చేసుకోగలం. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఫేక్ న్యూస్ వెల్లువలా వస్తున్నాయి.
8 వైరల్ వీడియోలు..
2014 లో మహారాష్ట్రలో సుఖోయ్ యుద్ధవిమానం కూలిన ఘటన, 2020లో బీరుట్ అటాక్.. ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలన్నీ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఆ వీడియోలన్నీ తమ విజయాలుగా చెప్పుకుంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రచారంలోకి తెస్తోంది. భారత క్షిపణుల్ని కూల్చేశామని, ఫైటర్ జెట్స్ ని మట్టుబెట్టామని అంటోంది. సుఖోయ్ యుద్ధ విమానం కూల్చేసి, భారత పైలట్ ని సజీవంగా పట్టుకున్నామంటూ తాజాగా ఓ వీడియోని పాక్ వదిలింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇతర దేశాల్లో జరిగిన దాడుల్ని కూడా భారత్ కి ముడిపెడుతూ పాక్ తప్పుడు వార్తలు సర్కులేట్ చేయడం విశేషం.
రాజోరి సెక్టార్ పై అటాక్ చేశామని, 20 రాజ్ అనే బెటాలియన్ ని మట్టుబెట్టామని పాక్ సైన్యం చెప్పినట్టుగా అక్కడి సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీటిలో ఏమాత్రం నిజం లేదు. అసలు భారత్ లో 20 రాజ్ బెటాలియనే లేదని అధికార వర్గాలంటున్నాయి. పేరులేని బెటాలియన్ పై దాడి చేశామని పాకిస్తాన్ చెప్పుకోవడం చూస్తుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అనిపించక మానదు. డ్రోన్లతో మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని పాక్ చూస్తోంది. అదే సమయంలో ఆధ్యాత్మిక ప్రాంతాలపై కూడా దాడులు జరుపుతూ రాక్షసానందం పొందుతోంది. అరకొర పాక్ దాడులు వాస్తవమే అయినా, మన క్షిపణుల్ని, యుద్ధ విమానాల్ని పాక్ పేల్చేసినట్టుగా వస్తున్న వార్తలు మాత్రం పూర్తి అవాస్తవం. అదే సమయంలో భారత్ దాడులకు పాక్ బెంబేలెత్తిపోవడం మాత్రం వాస్తవం.