దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన 22వ విడత పెట్టుబడి సాయం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ నిధులను బదిలీ చేయనున్నారు. గత కొంతకాలంగా ఈ నగదు ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ న్యూస్ తో పెద్ద ఊరట లభించినట్లయింది. సాగు అవసరాల కోసం కేంద్రం అందిస్తున్న ఈ సాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6,000 చొప్పున కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున నేరుగా నగదు బదిలీ (DBT) పద్ధతిలో జమ చేస్తారు. ప్రస్తుత విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ సాగు ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అస్సాం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతులతో ముఖాముఖి చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది.
అయితే ఈ నగదు పొందాలనుకునే రైతులు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అందుతాయి. భూమి రికార్డుల ధృవీకరణతో పాటు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సాంకేతిక కారణాలతో నిధులు పొందలేకపోతే వెంటనే స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతున్నాయి.
మార్చి 13న నిధుల విడుదల కార్యక్రమం పూర్తయిన వెంటనే రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. లబ్ధిదారులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సందర్శించి తమ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 21 విడతలను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు 22వ విడత విడుదలకు సర్వం సిద్ధం చేసింది.
ALSO READ: BEL Recruitment 2026: రూ.60వేల జీతంతో బెల్లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారందరూ అప్లై చేసుకోవచ్చు..!