Amaravati CRDA meeting: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తెలుగు వైభవాన్ని చాటేలా భావితరాలకు గర్వకారణంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబర్ సిటీ అవకాశాన్ని వదులుకున్న సంస్థలు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయని ఇది మన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ అని పేర్కొన్నారు.
రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద 167 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే టూరిజం ప్రాజెక్టును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక్కడ వాటర్ ఫ్రంట్ కల్చరల్ సెంటర్ అమ్యూజ్మెంట్ పార్కులు హోటళ్లను పర్యాటకులను ఆకర్షించే విధంగా డిజైన్ చేయాలన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ప్రాంతం ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడారంగం భవిష్యత్తులో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని దానికి బీసీసీఐ ఐసీసీ వంటి సంస్థలే ఉదాహరణని చెప్పారు. అదే తరహాలో అమరావతి స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ను కమర్షియల్ హబ్గా రూపొందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించుకోవడానికి రాజధానిలో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. సచివాలయం హెచ్ఓడీ భవనాల్లో అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాలని పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి తగిన పేరును పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సీబీఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించారు. తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి పరిహారంగా 3 ఎకరాలు పంచాయితీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేశారు. సచివాలయం హెచ్ఓడీ టవర్లలో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనుల కోసం రూ. 2,316 కోట్లు మంజూరు చేశారు. రూ. 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాజధాని పనులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.