PM Modi: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుపుకుంటున్న.. రజత్ మహోత్సవం వేడుకలకు ప్రధానీ మోదీ హాజరుకానున్నారు.
2000లో ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఈ ఏడాది 25 ఏళ్ల ప్రస్థానాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలో రాయ్పూర్లోని శహీద్ వీర్ నారాయణ్ సింగ్ పరేడ్ గ్రౌండ్ వద్ద.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవం ప్రధాన వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని.. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంకల్పాన్ని వివరించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని రూ.14,260 కోట్లకు పైగా పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. రోడ్లు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, గిరిజన అభివృద్ధి వంటి విభాగాలలో ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయి.
దేశభక్తుల త్యాగాలకు గుర్తుగా, ఛత్తీస్గఢ్ స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అలాగే గిరిజన స్వాతంత్య్ర సమర మ్యూజియంను కూడా ప్రారంభించనున్నారు.
అదే వేదికపై, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించనున్నారు. వాజ్పేయి నేతృత్వంలోనే 2000లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దిల్ కీ బాత్ కార్యక్రమం కింద.. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులతో మాట్లాడనున్నారు.
ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానం, మనశ్శాంతి కోసం నిర్మించిన ఆధునిక కేంద్రం బ్రహ్మ కుమారీల శాంతి శిఖర్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Also Read: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం
ప్రధాని పర్యటన నేపథ్యంలో రాయ్పూర్, నయా రాయ్పూర్ నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వందలాది పోలీసు సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, గూఢచారి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. వేదిక పరిసరాల్లో డ్రోన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేపట్టారు.