Modi Cabinet Expansion: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలో తన తొలి మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే పాలనలో మరింత వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన టీంను పునర్వ్యవస్థీకరించే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం జరుగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మే నెలలో ఈ భారీ ప్రక్షాళన ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం.
ఈ విస్తరణలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అదనంగా మరో ఇద్దరికి చోటు కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ నుండి బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరిని కేబినెట్లోకి తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, దివంగత మాజీ లోక్స్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు, టీడీపీ నుండి యువ ఎంపీ హరీష్ బాలయోగికి అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, జనసేన పార్టీకి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఇక ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు శాఖలు మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు స్వతంత్ర హోదా కల్పించే యోచనలో ప్రధాని ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగ్గా లేని కొందరు మంత్రులను, ముఖ్యంగా పెట్రోలియం వంటి కీలక శాఖల మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.
అలాగే ఈ విస్తరణలో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత పెరగనుంది. ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేంద్ర కేబినెట్లో కీలక బాధ్యతలు దక్కనున్నట్లు సమాచారం. గతంలో వాజ్పేయి హయాంలో ఆయన నిర్వహించిన వ్యవసాయ శాఖను తిరిగి నితీష్కు కేటాయించే అవకాశం ఉంది. బ్యూరోక్రాట్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న విమర్శలను చెరిపివేస్తూ, రాజకీయ అనుభవం ఉన్న నేతలకు ఈసారి మోదీ టీంలో పెద్దపీట వేయనున్నారు.
2029లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే 2029 ఎన్నికల వ్యూహంలో భాగంగానే తన సెకండ్ లైన్ లీడర్షిప్ను సిద్ధం చేసేందుకు ప్రధాని మోదీ ఈ విస్తరణను ఒక వేదికగా మలుచుకోనున్నారు. ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో, ఎవరికి పదవి దక్కుతుంది.. ఎవరికి ఉద్వాసన తప్పుతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Read Also: సెప్టెంబర్ సస్పెన్షన్ నుంచి ఏప్రిల్ పార్టీ దాకా.. కవిత వ్యూహం మామూలుగా లేదుగా!